పుట:Himabindu by Adivi Bapiraju.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణసాతవాహనుడు: స్థౌలతిష్యమహరీ! తాతగారూ! ప్రథమమున నన్ను చిరంజీవ అని ఆశీర్వదించితిరి. అదియే నిజము. తమ బాలికను నాకు ప్రసాదింపుడు.

స్థౌల: మహారాజా! నానోటినుండి మొదటవచ్చినదే సత్యము. నీ ప్రియురాలు మృత్యుంజయుని శరణ్యమునే పొందినది. ఇంక మీతండ్రి ఆంధ్ర చక్రవర్తిని, సకలజంబూ ద్వీపమునకు చక్రవర్తిగా నేనే ఈ పాటలీపుత్ర సింహాసనమున అభిషేకింతును. మీ మామగారును అభిషేకింతురు. ఇంక ఆరునెలలలో చంద్రబాల అమృతకన్య యగును. నీవామె నప్పు డుద్వాహ మగుదువుగాక!

అందరు తథాస్తనిరి. చక్రవర్తి స్థౌలతిష్యుని కడ మోకరించెను. 

19. విషకన్యకా శ్రీకృష్ణులు

విషకన్యక తాతగారి ఆశ్రమమునందే వాసముచేయ శ్రీకృష్ణుడు పంపించెను. ఆమెను గగనియు, కాశ్యపియు, అగస్తియు కలుసుకొని హృదయమార కౌగిలించుకొనిరి. ఆ పుణ్యబాలకును వారికిని కన్నులనీరు తిరిగినవి.

స్థౌలతిష్యునకు ఇన్ని సంవత్సరములు అణగియుండిన ఆపేక్ష నేడుపొంగి వరదలై ప్రవహించినది. జడభరతునకు కురంగశాబకముపై ప్రేమ పూర్వకర్మ వశమున నదియై ప్రవహించినట్లు, నేడు మనుమరాలిపై ప్రేమ మిన్నుముట్టినది. ఇన్ని సంవత్సరములు తన మనుమరాలిని భయంకర మారణయంత్రముగ సిద్ధముచేసినాడు. కర్కశహృదయుడై బౌద్ధ జిన ధర్మనిర్మూలన మొనర్ప సంకల్పించిన యా వృద్ధునకు నేడు ఆ యావేశ మెల్ల సూర్యకిరణస్పర్శమాత్రమున విరిసిన మంచువలె మాయమైనది.

మనుమరాలే తనకు దేశికత్వము వహించినదా యని యా తపస్వి తలపోసినాడు. శాంతిజ్యోత్స్నావిలసితమూర్తియై, సౌందర్యశ్రీ విలసితమై అగస్తీ గగనీ కాశ్యపీ మధ్యస్థయై, కృష్ణాజినాసనయై యున్న యా బాలికను జూచి స్థౌలతిష్యుడు విశ్వామిత్రునిబారినుండి రక్షింపబడిన నందినీ ధేనువును జూచిన వసిష్ఠ మహాఋషి వలె ఆనందపూర్ణహృదయు డయ్యెను.

విశాలములైన యామెకన్నుల కోటి తారాద్యుతులు వెలుగు నిర్మల యామినీ కాంతులు నృత్యము చేయుచున్నవి. ఆమె మోమున బాలికారేఖలు పోయి క్షీరనదీరేఖలు వికసించినవి. అడవి దొండపండువంటి యామె పెదవులు క్షీరసముద్రమున శ్రీమన్నారాయణశయనీయ పూర్ణకమల పరిసర జనిత సరోజ కుట్మములై అమృతస్విన్నములైనవి.

స్థౌలతిష్యమహర్షిసంకల్ప మీనాడా బాలికను అమృతకన్యను చేసి, శ్రీకృష్ణ సాతవాహన ప్రభువున కుద్వాహ మొనరింపవలయు ననియే! వేదమంత్ర ద్రష్టలైన మహాఋషుల పావిత్ర్యమే జంబూద్వీపమును సకల ధర్మసంయుక్తను జేయుచుండును. ఏ మహావీరుడో, ఏ గౌతమబుద్ధుడో జనించి, వేదధర్మమందలి భిన్నభావముల ఒక్కొక్క కాలమున విలసిల్ల జేయుగాక! అందేమి దోషమున్నది? అమృతకన్య యగు విషకన్యకా ప్రభావమున సాతవాహనమహారాజులే యజ్ఞయాగాది క్రతువు లొనర్తురు. వారు సర్వధర్మ ప్రవర్తకులగుదురుగాక యని సంతుష్టుడైనాడు.


అడివి బాపిరాజు రచనలు - 2

• 283 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)