పుట:Himabindu by Adivi Bapiraju.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 సిద్ధార్థినిక మితభాషిణి. తొమ్మిదియేండ్ల యీడుగల యా చిన్నబాలిక ఎప్పుడు నేదో యాలోచనముననే యుండును. ఇతర బాలికలతో కలసి యాడుకొనదు.

తల్లితండ్రులు బుద్ధపూజవేళ పాడుకొను ప్రాకృతగీతముల నాబాల యెప్పుడును తనలో తాను పాడుకొనుచుండును. ఆమెకంఠ మతి మధురమైనది. ఆమె యాటగది యందున్న బొమ్మలన్నియు బుద్ధారాధన సంబంధములైనవే. బుద్ధపాదములు, ఛత్రములు, ధర్మచక్రములు చిన్న చిన్నవి పాలరాతితో, వెండితో, దంతముతో గంధపుతరువుతో విన్యాసము చేసి ధర్మనంది తనయకు బహుమానము లిచ్చెను. ఆ గదినంతయు నవి యలంకరించుకొని యామె పుష్పములు సేకరించి, ఫలములు ప్రోగుచేసికొని, మహాలి నడిగి, ధూపవత్తియలు, సువాసనాద్రవ్యములు తెచ్చుకొని పూజలు సల్పుచుండును. అన్నగారి శిల్ప మాబాలికకు ప్రాణము. నాగబంధునిక కన్నగారి వీరవిద్య హృదయా నందకరము. అన్నగా రేనాడు కవులు రచించు కావ్యానికములు మనోహర గాంధర్వ యుతముగ పాడుకొనునో అప్పు డన్నగారికడ చేరి, యాతని యొడిలో తలనుంచుకొని పెద్దవియైన లేడికళ్ళరమూతలుగా నన్నగారి ముఖమును, ఆకాశము నవలోకించుచు సిద్ధార్థినిక వినుచుండును. అన్నగారు పాటలు పాడుకొనునప్పుడు నాగబంధునిక ఆ చుట్టుప్రక్కలకు రాదు.

అన్నగారు శృంగారరసభావపూర్ణములగు పాటలు పాడినప్పుడు నాగబంధునిక “ఛస్ ఈ శర్కరకేళిపండ్లు నాకిష్టముండవు” అని నవ్వుచు వెడలిపోవును. సిద్ధార్థినిక కప్పు డక్కపై అమితముగ కోపమువచ్చును. అన్న పాడు పాట అర్థమై కాదామె ఆనందించుట. అన్న పాటలలో దూరదూరమున యశోధరాదేవి యున్నదని యామె చిరుహృదయము, చిట్టి భావముల చిన్న ఆలోచనలతో ఉప్పొంగిపోవును.

ఈరోజున నాగబంధునిక సువర్ణశ్రీ వీపుపై ఒక గ్రుద్దు గ్రుద్ది “అన్నా! పదిక్షణము లీశిలము సంగతి మరచిపోకూడదా? రా; వృపభశాలకుపోవుదము. శైబ్య సుగ్రీవకము లేమిచేయుచున్నవో కనుగొందము. చెల్లి గిత్తలకడకు రానేరాదు. చిన్నదూడలు, ఆవులు, ఆబెయ్య లీ వెర్రితల్లికి ప్రాణము చెల్లీ! ఓ వెన్నమ్మగారూ! ఓ మామిడిపండురసంగారూ! ఓ చెరకు పానకంగారూ! ఈ వేళనైన కొన్ని మిరియములు తినవే! కొంచెము నల్లజీలకర్ర రుచిచూడవే. అల్లము లవణముతో కలిపి తినవే. రా; అన్నను పందెము నెగ్గించే కైలా సశిఖరములను చూచెదము రా; జజ్జమ్మతనము వదలు” అని నవ్వింది.

“ఓ మగక్కా! నీవు గడనెక్కి యాటలాడుము. భీమునివలె నేనుగులతో బంతులాడుము. తాటకివలె చంటిపిల్లలను మూటగట్టుకొనిపో. నిన్ను చూచిన నాకు భయము వేయుచున్నది. అన్నచాటున దాగు కొనవలెను” అని సిద్ధార్థినిక కోపము నటించుచు నవ్వసాగెను. 

7. సార్వభౌముని జన్మదినోత్సవములు

ధాన్యకటకమునకు అయిదుగోరుతముల దూరమున కృష్ణానదీ కూలమున పురబాహ్యోద్యానమునకు సమీపముననే మహాఖేలనా ప్రదేశమున్నది. అది సుమారు నూరు నివర్తము లున్నది. (నివర్తము సుమారు మూడు ఎకరములు) ఆ విశాలస్థలమున సర్వకాలములయందు మల్ల యుద్ధములు, పందెములు, ఆటలు మొదలగునవి


అడివి బాపిరాజు రచనలు - 2

• 19 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)