పుట:Himabindu by Adivi Bapiraju.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ యాత్రలు సలుప తల్లిదండ్రులయనుమతి గోరినాడు. ధర్మనందియు, శక్తిమతీదేవియు సువర్ణశ్రీచరిత్ర తెలిసికొనియుండిరి. వారు ఆతని నాశీర్వదించిరి.

వెనుకనే హిమబిందునకు మహాబలగోండుని యనుమతితో నూరుగురు గోండువీరులను అంగరక్షకులుగ సువర్ణశ్రీ ఇచ్చియుండెను. వారిని హిమబిందు యువరాణి యగువరకు నా దేవికడనే యుండవలయునని గోండుయువరాజుతో తెలిపి సువర్ణశ్రీ యాత్రాభిముఖుడై బయలుదేరి పోయెను.

అతడు ప్రథమమున కపిలవస్తునగరము చేరెను. అచ్చట బాలుడగు సిద్ధార్థదేవుని మనమున ప్రత్యక్ష మొనర్చుకొనెను. అచ్చట విహారమున మాయాదేవి స్వప్నము, ధవళదంతావళము ఆమెగర్భమున జొచ్చుట, లుంబినీ వనమున తథాగతుని జన్మము, ఆ బోధిసత్వుని జాతకము వ్రాయుట చిత్రించినాడు. ఆనాటి యాచారముచొప్పున సమంతభద్రుని మూర్తిగా చిత్రించక, పాదములు, ధర్మచక్రము, ఛత్రము, పూర్ణకలశము చిహ్నలుగా చిత్రించెను.

కపిలవస్తునుండి సువర్ణశ్రీ లుంబినీవన సంఘారామమునకు బోయినాడు. అచ్చటనుండి మధురానగరము పోయి, వెనుకకు మరలి సువర్ణశ్రీ కాశీపురమువచ్చి మృగవన సంఘారామము చేరినాడు.

ఆ సంఘారామ కులపతి మహాశిల్పి ధర్మనందిపేరు వినియున్నాడు. ఆతని కొమరుడు సువర్ణశ్రీ యని ఎరింగి ఆనందమున సువర్ణశ్రీ తలపై చేయివైచి “కుమారా, మా సంఘారామచైత్యవిహారముల నలంకరించి జగదద్భుతముగ నొనర్పుము” అని ఆశీర్వదించినాడు.

సువర్ణశ్రీ తనవిడిదికి వెడలిపోయినాడు. అవును, అటులనే తా నొనర్చును. శిల్పము, చిత్రలేఖనము ఆ విహారము లన్నియు నల్లుకొని పోవుగాక! చైత్యములు పవిత్రమైన పూజాలయములయిపోవుగాక యని హృదయమున మహాశ్రమణకునకు నమస్కృతి యర్పించెను.

17. అమృతకన్య

అమృతపాదులబుద్ధిలో రెండు మహాప్రవాహములు సంగమించినవి.

ఒకటి - చిన్ననాటినుండి స్థౌలతిష్య మహాద్రిజనితమై, వేగవంతమై, ఆదిని చిన్న శైవాలినీరూపమున, పోనుపోను మహానదియై ప్రవహించిన నందిదత్తజీవితము, ఆతని సంస్కారము, ఆతని జ్ఞానము, ఆతని విద్యయును, రెండు - గంగానదీజనితమై, ఆనందాశ్రమ పోషితమై, ఆనందాశ్రమ కులపతి ప్రజాపతి కాశ్యపాచార్యబోధితమై, ప్రవహించి ధాన్యకటక సంఘారామ కులపతియైన, అమృతపాదార్హతుల జీవితము, ఆతని సంస్కారము, ఆతని జ్ఞానము, ఆతని విద్యయును.

రెండును నేడు స్థౌలశిష్యునిదెబ్బతో, శస్త్రవైద్యముతో పర్వతముల ఛేదించుకొని సంగమించినవి.

ఒక నది ధవళదేహ ఒక నది నీలశరీర, ఈనాడు రెండును కలిసి ఏమియగును? ఆతడు బౌద్ధుడా, వేదవతుడా? ఆతడు సన్యాసియా, విధురు డైన గృహస్థా?

మానవధర్మము, మానవాతీతధర్మము నాతనిలో సంఘర్షణకు బాల్పడినవి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 278 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)