అమృత: వ్యావహారికముగ నొకటి కాదు. గుణముచేతను ఒకటి కాదు. ఆవిరిగుణము వేరు, మేఘగుణము వేరు, వాపీకూపతటాకాదుల రూపముననున్న జలము గుణము వేరు.
స్థౌల: కాని జలభావము ఒకటియేనా?
అమృత: అవుగాక!
స్థౌల: అవుగాక ఏమి, మీ మొగము! అటులనే పరబ్రహ్మ మొకటి, తక్కిన వన్నియు ఆతని ఆభాసలు. అవి అజ్ఞానముచే, మాయచే కలిగే భ్రమ!
అమృత: ఎవరికి స్వామీ?
స్థౌల: జీవునకు.
అమృత: జీవుడును ఆభాసయేకాదా?
స్థౌల: ఆతడును.
అమృత: మాయాజాత మగునది ఆభాస, మాయాజాత మగునది అజ్ఞానము, మాయాజాతుడే జీవుడును. ఆ జీవుడును, అజ్ఞానమును ఒకటి అయినప్పుడు జీవునకు అజ్ఞాన మేమిటి స్వామీ?
స్థౌలతిష్యుని ముక్కుపుటములు విస్తృతము లయ్యెను. “ఓయి అజ్ఞానీ, నీకు స్వప్నము వచ్చు చున్నది. స్వప్నములో ఇది స్వప్నమే అని ధైర్యము తెచ్చుకొనుచుందువు. స్వప్నములో స్వప్నము సంగతి ఎరుగవా?” అని గంభీరస్వరమున నరచినాడు.
అమృతపాదులు చిరునవ్వునవ్వినాడు.
11. “నీ కిదే శిక్ష”
స్థౌలతిష్యుడు అతిజాగరూకతతో అమృతపాదులను పరీక్షించెను. ఎవ్వరీతడు? ఈతనిమోము తనకు పరిచితమై తోచును. ఈతనిపై ఏదియో దయ తనయం దావిర్భ వించుచున్నది. అయిన నీతడు చార్వాకుడు, విమతుడు, అనార్షధర్మయుక్తుడు కావున గర్హ్యుడు. అంతఃకరణ ప్రవృత్తికి, సత్యమునకు వైరుధ్యము కలిగినప్పుడు, అంతఃకరణ ప్రవృత్తిని నాశనముచేయవలయును. ఇట్టివాడే ఆ సిద్ధార్థుడు. ఆతడు బౌద్ధుడట. ఇదియే కలిమాయ. వేదములను గర్హించినవాడెల్ల ఒక మహాగురు వగుచున్నాడు. అనార్షదర్శనము లన్నియు నట్లే ఉద్భవించినవి.
అయినను ఏల తన కీ బౌద్ధునియందు కరుణకలుగవలెను? ఏ పూర్వసంబంధ ముండియుండును?
స్థౌల: పూర్వాశ్రమమున మీరెవరు?
అమృత: నా కేమియు తెలియదు.
స్థౌల: అదేమయ్యా! తెలియకపోవుట ఏమి? అట్లనుట మీ బౌద్ధ ధర్మమా, లేక తపస్సుచే అట్లు మరచిపోదురా?
అమృత: స్వామీ! మీ రన్నది ఏదియుకాదు. నా కేకారణము చేతనో పూర్వస్కృతి పోయినది. ఆ సంఘటన నా తలకు తగిలిన దెబ్బవలన నై యుండవచ్చును.
స్థౌల: దెబ్బ ఎందుకు తగిలినది?
అడివి బాపిరాజు రచనలు - 2
• 263 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)