పుట:Himabindu by Adivi Bapiraju.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముక్తావళీదేవి తన అనుగుబిడ్డ ప్రజాపతిమిత్ర విగ్రహముకడకు పోయి ద్యోఃపితను అపోదితీ ని ప్రార్థించెను.

10. జ్ఞాన యుద్ధము

అమృతపాదులు: తథాగతుడు “చత్వారి ఆర్యో సత్వాని” - నాలుగు సత్యములను గురించి ఇట్లు చెప్పినాడు : స్వామీ, ప్రపంచమునందు దుఃఖమున్నది. మనము పుట్టినప్పుడు బాధ నందుదుము. బ్రతుకంతయు దుఃఖమయము. ముసలితనము దుఃఖము. చావు దుఃఖము. మనము కాంక్షించినవి మనకు లభింపకపోవుట దుఃఖము. మనము ప్రేమించినవారి ఎడబాటు దుఃఖము.

స్థౌలతిష్యులు: అవునయ్యా, ఇవి పామరునకు దుఃఖములు, జ్ఞానికి దుఃఖములు కావుగదా?

అమృత: అక్కడికే వచ్చుచున్నాను. రెండవ సత్యము - దుఃఖమునకు కారణము తృష్ణ, తనకై బ్రతుకుట, సమస్తము తనకై వాంఛించుట. కాబట్టి జీవితము వేదనాభరితము. ప్రతినిమేషము మనముదేనినో కాంక్షించున్నాము.

స్థౌల: ఈ సంగతులు చెప్పుటా బౌద్ధధర్మము! ఇవి ఎట్టి పామరుడైనను చెప్పవచ్చును.

అమృత: చిత్తము. మూడవ సత్యము - ప్రతిమనుష్యుడు దుఃఖ నివృత్తికై ప్రయత్నము చేసితీరునని. అది ఎట్లు సంభవించును? మనలోని కాంక్షలను చంపుకొనుటచే, కాంక్షలు తృప్తిపరచుటచే అడగిపోవు. ఇంధనములు వేసిన అగ్నివలె అవి ఇంకను ప్రజ్వరిల్లును.

స్థౌల: ఈ బాలబోధ విన్పింప వచ్చినావురా నాకు?

అమృత: కాదుస్వామీ! ప్రారంభము చిన్నపిల్లవాని బోధవలెనే యుండును. ఆత్మవిచారము ప్రాపంచికానుభవమునుండి ఉద్భవించును.

స్థౌల: కానిమ్ము, కానిమ్ము; మీ ఆడమ్మల ఆత్మవిచారణమంతయు విని కొంచెము నవ్వుకొందును.

అమృత: స్వామీ! నాల్గవ సత్యము ఆర్య అష్టాంగమార్గము. ఈ నిధానము కాంక్షలను నాశనముచేయును.

స్థౌల: మీ అష్టాంగమార్గము నాకు తెలియును. ప్రతిమనుష్యుడు ఈ నాలుగు సత్యములు ఒప్పుకొని తీరవలయునా?

అమృత: స్వామీ! అవి ఒప్పుకొని తీరవలయునని తథాగతుడు సెలవీయలేదు. మనుష్యుడు ప్రపంచము, జీవుడు, దుఃఖము, చావు, మనస్సు, విశ్వము మున్నగు సర్వవిషయములగూర్చి తనలో తాను విచారించుకొనవలయును. ఇది ధర్మమునకు మొదటిసూత్రమని సెలవిచ్చినారు.

స్థౌల: ఆ ముక్కలు చిలుకపలుకులవలె నాకు చెప్పవచ్చితివా?

అమృత: తాము బౌద్ధధర్మ మేమియని పృచ్ఛచేయుటచే ప్రారంభించితిని. తాము ప్రశ్నలు వేసినచో, నేను ప్రతివచన మిత్తును, లేదా ఈరీతిని, ఈ విషయమునుగూర్చి చెప్పుమని ఆజ్ఞచేయుడు, అటుల నొనరించెదను.

స్థౌల: మంచిది. నీ యిష్టమువచ్చినట్లు కానిమ్ము.

అడివి బాపిరాజు రచనలు - 2

• 261 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)