ఇరువాగుల సైన్యములవారును జయజయధ్వానములు కావించినారు.
సుశర్మ: “మహారాజా! మా కణ్వాయనయుగ మింతటితో అంతరించినది. కాని, దక్షిణాత్యులగు మీరిచ్చటనుండి ఏమిపాలన మొనరింప గలరు? మీరు బౌద్ధులై వేదముల నగౌరవ మొనర్చితిరి. యుగయుగముల నుండి పవిత్రమైయుండిన ధర్మముల నడుగంటించి, వేదబాహ్యమైన ఈ చార్వాకమతమును విజృంభింపచేసినారు. మీ బుద్ధుని ధర్మము శాశ్వత మగునా? వేదములే పరబ్రహ్మ స్వరూపములు. అవి నాశనము కావు. ఈ దినముకానిచో రేపు మీబౌద్ధధర్మము నాశనమైపోవును. ఈ జంబూ ద్వీపమునందు బుద్ధధర్మమే లేకుండా నాశనమగుగాక! మా ధర్మము మేము నిర్వర్తించితిమి. మీ రనుమతించినచో మేము వానప్రస్థమునకై హిమాలయములకు పోదుము. లేదా మీ ఇష్టమువచ్చినట్లొనరింపుడు అనెను.
శ్రీముఖుడు: చక్రవర్తీ! మీరు మీ ధర్మము నిర్వర్తించినారు. మేము మా ధర్మమును నిర్వర్తించినాము. “మే మొనరించినది ధర్మ బద్ధము మీది కాదు” అని మేము అనము. తాము తప్పక హిమాలయములకు పోవచ్చును. మనము ప్రయత్నము చేయవలెను. తర్వాత కర్మమెట్లు నిర్దేశించునో యట్లు జరుగును. తామెప్పుడు ప్రయాణముచేయ నిచ్చగింతురో యప్పుడ మీ కిష్టమగునవన్నియు గొనిపోవచ్చును. మేము మీ సేవకులము, మీ అతిథులము.”
సుశర్మ “మహారాజా! సెలవుతీసికొందుము. వేద ధర్మమును, బౌద్ద ధర్మమును సమానముగ పాలింపుడు, అదియే మా కోర్కె అని యంతఃపురములోని కరిగి హిమాలయప్రస్థాన ప్రయత్నమున నుండెను. ఈ విజయమునకు సువర్ణశ్రీ కారకుడని చక్రవర్తి యాతనివంక దొరిగి, తనమెడలోని నిద్రుమమాలను అతని కంఠమున వైచెను.
విజయులైన ఆంధ్రులు మహోత్సవము లొనరించుట ప్రారంభించిరి.
సువర్ణశ్రీ నగరములో తండ్రిగారు విడిదిచేసిన భవనమునకు బోయెను. తనధర్మము నెరవేర్చినాడు. ఈ మహాయుద్ధము తన ప్రాణములు కాంక్షించినచో నిచ్చుటకు సిద్ధపడియే ముందుకు చొచ్చుకుపోయినాడు. ఎప్పటికప్పుడు కొన్ని గాయములు తగిలినమాట నిజమే. ఒక్క గాయమును బ్రాణముగొనలేదు. తాను యశమును ఆశించినాడు. ప్రాణ నష్టము ఆశించినాడు. రెండును తుచ్ఛములే. ఒకటి సంభవించినది, ఒకటి సంభవించలేదు.
పొమ్మన్నను పోని యీ ప్రాణము తీపి, దానిని వదలలేము. ప్రాపంచికానందము కావలెను. భార్య కావలెను. ఎంత విచిత్రమైనది మానవజీవితము! ఈ ఆలోచనలతో తన వైద్యునిచే గాయములకు కట్టుకట్టించుకొని, ఆలోచించి ఆలోచించి, తల్లిదండ్రుల సెలవునంది తాను యాత్రలు సలుపుచు ధాన్యకటకము చేరెదనని వెడలిపోయెను.
6. అమృతపాదులు
సర్వదక్షిణాపథచక్రవర్తిని సర్వభారత వర్ష చక్రవర్తిగా అభిషేకింప మహా ప్రయత్నములు జరుగుచున్నవి. దేశదేశముల మహారాజుల, భూపతుల, మహా మాండలికుల, మహాఋషుల, పండితుల, అర్హతలు, సంఘారామాచార్యుల, వివిధ
అడివి బాపిరాజు రచనలు - 2
• 250 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)