పుట:Himabindu by Adivi Bapiraju.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యువరాజులకు త్వరలో శుభము కల్యాణమగునని మా శాస్త్రము చెప్పుచున్నది” అని యా భిక్షుకుడు తేల్పినాడు.

“స్వామీ! మీ మాటలు మాకు ధైర్యమొసగుచున్నవి. యువరాజుల వారును, మేమును మహారాణియు గురుపాదులకు, తమకు ఎంతేని కృతజ్ఞులము” అని సార్వభౌముడు పలికెను. ఆ భిక్షుకుడు “బుద్ధదేవుడు మిమ్మురక్షించుగాక, ధర్మము మిమ్మురక్షించుగాక, సంఘము మిమ్మురక్షించు గాక” యని ఆశీర్వదించుచు అటనుండి మహారాణి కడకు జనియెను.

భర్తయు, జ్యేష్టపుత్రుడును తనకన్నతండ్రి దొరికితీరునని ధైర్యము చెప్పుచున్నారు. అబ్బా! ఎంతటి చిన్నబాలకుని ఆ కఠినాత్ములు కొనిపోయినారు! ధనమునకై యాశించికాదు. రాజ్యసంక్షోభము కల్పించుటకుగాదు. అందాలబిడ్డను కన్నతల్లి చేతులనుండి ఊడబెరికి, ఆ తల్లిని దుఃఖ పెట్టుటకు మాత్రము ఆ కరుణహీనులు అట్లు చేసినారు.

ఆ అయిదేడుల బాలుడు ఎన్ని కడగండ్లు పడుచుండెనో. అతని బంగారు పనసతొనలు ఎండిపోయెనో? తల్లియైన ఆ మహారాణికి కన్నుల నీరు తిరిగినది.

ఇంతలో ఒయ్యారముగ నడచుచు మహారాజు కొమరికలగు మాయాదేవియు, శాంత శ్రీదేవియు, పరిచారికలు కొలువ తల్లికడకు విచ్చేసి తల్లిపాదములకడ మోకరించిరి. ఇరువురిని చెరియొక చేతితో లేవనెత్తి, మహారాణి తన హృదయమున కత్తుకొన్నది.

“మాయాకుమారీ! రేపుమీరు సలుపు నాట్యమేమి?” అని మహారాణి అడిగినది. వర్షమువెలిసి, మబ్బులు మాయమైనవెనుక వెన్నెలవలె, ఆమెమోమున చిరునవ్వులు ప్రసరించినవి.

“మాయాదేవి జనకుని పోలిక, శాంతశ్రీదేవి అచ్చముగ తల్లిపోలిక, వారిరువురు చక్కనిచుక్కలు. రాజశ్రీవారి కన్నులలో, చంపకపుష్పనాసికలలో మందారకుట్మ లార్ధ్రములుగు పెదవులలో వెలిగిపోవుచుండెను.

వారిరువురు తల్లికి చెరియొక ప్రక్క నధివసించిరి.

మాయాదేవి: అమ్మగారూ! అన్నయ్యగారు తమ అంతఃపురములోనికి వచ్చినారటకదూ!

శాంతశ్రీదేవి: అన్నయ్యగారు మా మందిరానికి ఎందుకు వచ్చినారు కారండీ?

మహారాజ్ఞి: అరుగో ఈ దారినే యువరాజు వచ్చుచున్నారు.

అప్పచెల్లెళ్ళిద్దరు లేచి ముందుకు త్వరితముగ బోయి అన్నగారి పాదములకు నమస్కరించిరి. శ్రీకృష్ణుడు వారిరువురకు మాయామాత రక్షచెప్పి, లేవదీసి, ఇద్దరినీ చెరియొక చేతితో నడుములుచుట్టి తనకదుముకొని, వారి తలలను తన చెంపలకాన్చి, వారి ఫాలములు ముద్దుకొని, మరియు వదలెను. ఆనందదేవియు లేచి వీరి మువ్వురికడకు వచ్చెను.

“మా అన్నయ్యగారు ఈదినము మా ఇంట నాతిథ్యముపొందరా?” అని మాయ అన్నది.

“రండి అన్నగారూ, నేను వీణమీద ఇరువదియైదు మూర్ఛనలు నేర్చుకొంటిని. అవి అన్నియు పాడి వినిపింతును” అని శాంతశ్రీ యన్నది.

“నాయనా! మీరు ఈ పూట వీరి మందిరానికే భోజనమునకు పొండు. ఈ రాత్రియు, రేపుదయమునను మహారాజు మందిరమున మీకు ఆతిథ్యము” అన్నది ఆనందదేవి.

అడివి బాపిరాజు రచనలు-2

  • 16*

హిమబిందు (చారిత్రాత్మక నవల)