పుట:Himabindu by Adivi Bapiraju.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ వేగము మహావేశపూరితమైనది. అతని ఆవేశమే ఆంధ్రవీరులనుగూడ ఆవేశింప ఘోరయుద్ద మొనర్చుచుండిరి. కందకములో పుట్టెలు, నావలు వైచిరి. కోటగోడలపై నుండి వచ్చు అగ్ని వర్షమునకు, బాణవర్షమునకు నున్నని దళసరి ఖడ్గమృగపు చర్మములచే, ఎనుబోతు చర్మములచే సంతరింపబడిన కేడెముల వితానమే రక్షగా సైనికులు నావలపై గోడలదగ్గరకు బోయి, ద్వారము జేరబోయి వానిని భేదింప గడగుచుండిరి.

యాంత్రికాయుధములు సంతతధారగా కోటలో గురియుచుండెను సువర్ణశ్రీ స్వయముగ ఒక ఏనుగుపై నున్నిశయ్య లమరించి, ఆపైన ఇనుపఫలకములు కప్పి అందు పూర్ణకవచధారియై కూరుచుండి, పైన ఉక్కుకేడెముల ఛత్రములవలె గజరక్షకులు పట్టియుండ నీటిలోనికి నా గజమును దూకించెను. ఆ మహాగజమునకు మహాకవాట విధ్వంసిని యన్న బిరుదనామ మున్నది. ఆ దంతావళము కరమున నినుపగుదియబూని గోపురద్వారమును ముక్కలగునట్లు తాడన మొనరింపసాగేను.

పై నుండి మృత్యువర్షము కురియుచుండెను. ఒక గడియలో ద్వారములు వివిధములగు తాకుడులవలన ముక్కలై విడినవి. ఆంధ్రసైన్యము “జై సువర్ణా” యని లోనికి జొరబడెను. వెంటనే చక్రవర్తి నూరుగజముల సింహద్వారము కడకు దూకించెను. పుట్టెలు, పడవలు వందలకొలది నిండిపోయినవి. వేనకువేలు సైన్యములులోని కురికినవి. కాణ్వాయన సైన్యము లాధాటి కాగలేక వెనుకంజ నిడినవి. చక్రవర్తియే కోటలోని కడుగిడెను. తన మహాధనుసుతో చక్రవర్తి నిరంతర బాణ ప్రయోగము చేయుచు ప్రాణములు గొనుచుండెను. ఆ సంకుల సమరములో చక్రవర్తి వైతాళికులచే “ఆయుధములు పడవేసినవారికి రక్ష” అని కేకలు వేయించుచుండెను. ఒక్కసారిగా ఆ ద్వారముకడ యుద్ధముచేయు ఏడువేలమంది తమ ఆయుధముల క్రింద బడవేసిరి.

సువర్ణశ్రీ నూరుగురు మహావీరులతో, కాణ్వాయనచక్రవర్తి గజారోహియై యుద్ధము నడుపుదెస కేగి, “కాణ్వాయనమహారాజా, ఇంతటితో యుద్ధయు చాలును. మీ భటు లందరు నిరాయుధులైనారు. యుద్ధము మాన తమ సేనల కాజ్ఞనిండు. తమ్ము బంధింపము. చక్రవర్తి గౌరవము లొసగబడును” అని కేకవేసెను.

సుశర్మకాణ్వాయనునకు పాటలీపుత్రనగరము పట్టుబడులతోడనే వైరాగ్య ముదయించి యుండెను. తన సేనలయందే తనకు నమ్మకములేక యుండెను. కావున సువర్ణశ్రీ అట్లు పలికిన వెంటనే యుద్ధవిరమణ భేరీ చఱపించెను.

“ఆ భేరీనినాదములు వినగనే సుశర్మచక్రవర్తి సైనికులు ఆయుధములను క్రిందపారవేసినారు.

సుశర్మ చక్రవర్తి విచారవదనమున గజావరోహణ మొనర్చెను. సువర్ణశ్రీ ఆ ప్రభువునకు సాష్టాంగదండ ప్రణామంబు లిడి, లేచి “మహా ప్రభూ! రండు తమ దర్శనము చేయ మా చక్రవర్తి వేంచేయుచున్నా” రనెను.

శ్రీముఖచక్రవర్తియు పాదచారియైవచ్చి, సుశర్మచక్రవర్తికి వీర నమస్కార మిడెను.

ఇరువురు బ్రాహ్మణులు, చక్రవర్తులు. ఒకరు ఓడినారు, ఒకరు జయమందినారు. సుశర్మ శ్రీముఖునకు ప్రతినమస్కారమిడెను. శ్రీముఖ చక్రవర్తి సుశర్మకడకు పోయి, యాయనను కౌగలించెను.

అడివి బాపిరాజు రచనలు - 2

249

హిమబిందు (చారిత్రాత్మక నవల)