పుట:Himabindu by Adivi Bapiraju.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవరీతి ప్రేమగలవారు వివాహమైన వెనుక భర్తనే క్రమముగా దైవమునువలె ప్రేమించుటయు కలదు. కావుననే నీవు సువర్ణశ్రీని ప్రేమించియు, నీ తండ్రి నిన్ను శ్రీకృష్ణసాతవాహనున కిత్తునని చెప్పగనే ఊరుకొంటివి. కావుననే ఇట్టి రసాభాస యగుచున్నది.

హిమ: తాతయ్యా! నీవు చెప్పినది నిజము. ఇప్పుడు నేనేమి చేయగలను?

కీర్తి: తల్లీ! నీవలన తప్పులేదు. నీలోని యవనర క్తము దీ తప్పు. నేను మీముత్తవను భారతీయకారిగా నొనరించుటకు ఎంత తప మొనరించితినో తెలియునా! చివరకు విజయమందితిని. నీ తల్లి నాకొమరిత! మీ అమ్మమ్మ కొమరితకాదు. నీవు మీ అమ్మమ్మకు, నాకును మనుమరాలివి. నీతండ్రి కూతువు.

హిమ: తాతయ్యా! నాహృదయమంతయు నీకు విప్పిచెప్పితిని, నీ మేమి చేయు మన్న చేసెదను. ఒక్కటి మాత్రము నిజము. నా అంతరాత్మయో ఏదియో నాకు చెప్పుచున్నమాట నిజము. నేను కోరినపురుషుడు నాకు భర్త కానిచో, నా తాతవలె నేనును దీక్ష గైకొందును. లేదా, నా ప్రాణము ఈ బొందిని వీడును. నాకా శిల్పియే దైవము, మిత్రుడు, భర్త. నా అనుమానము లన్నియు వీడినవి. అతని నామము తలువని నిమేష మొకటి లేదు. నిద్దురయే లేదు! స్వప్నములు, స్వప్నముల నా దివ్యమూర్తి!

ఇంతలో కీర్తిగుపులు పంపిన చారు డొకడు తిరిగివచ్చినాడని కంచుకి చెప్పినాడు. కీర్తిగుపుడు లోనికిరా ననుమతి నిచ్చుటయు, నాతడు వచ్చెను.

“అయ్యా, సువర్ణశ్రీ నిన్ననే పాటలీపుత్రము వీడి ఎచ్చట కేని పోయేనట” అని చెప్పెను. 

5. సుశర్మ ప్రస్థానము

పాటలీపుత్రము ఆంధ్రులవశమైన దినముననే సువర్ణశ్రీకుమారుడు మహావేగముతో నగరదుర్గమును పదివేలమంది సైనికులతో ముట్టడించెను గంగానదీతీరమున తూర్పుగ తీరస్థ కుడ్యములకు నూరుధనువుల దూరమున చంద్రగుప్త సార్వభౌముడు నగరదుర్గమును నిర్మించెను. ఈదుర్గము చిన్న నగరమంత విశాలముగ నున్నది. ఈ దుర్గముచుట్టును గంగానదిలోనుండి ఒక శాఖను కొనివచ్చి లోతును, వెడల్పును గల పరిఖగా నొనర్చి దుర్గసంరక్షణ చేసినారు. ఈ దుర్గమునకు నాల్గువైపుల నాలు ద్వారములుమాత్ర మున్నవి.

చక్రవర్తి సౌధములు, హర్మ్యములు, మహాభవనములు, రాజోద్యానములు నెంతో సుందరములుగా నశోకచక్రవర్తి నిర్మించినారు.

నేడు ఆంధ్రులు పాటలీపుత్ర మహానగరమును స్వాధీనము చేసికొనదిగనే సుశర్మకాణ్వాయనుడు ఏబదివేలమంది సైన్యముతో, సేనానాయకులతో రాజకోటనుండి యుద్ధము సాగించుచుండెను.

సువర్ణశ్రీ యుద్ధము చేయుచు, దుర్గసింహద్వారగోపురమునే తల పడెను. సమవర్తి, సోమదత్తాచార్యులు, స్వైత్రులవారు తక్కిన మూడు గోపురములకడ విజృంభించిరి. సువర్ణశ్రీ యుద్ధవిధానమును గమనించుచు ఆతని కనేకవిధముల బాసటయై చక్రవర్తియే ఇరువదివేల సైన్యముతో వెనుక నిలిచియుండెను.


అడివి బాపిరాజు రచనలు - 2

• 248 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)