పుట:Himabindu by Adivi Bapiraju.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నిజమేకాని ఈలోపల అత్యవసరవిషయ మొకటి వచ్చినది. నే నా దేవిని చూడక తీరదు. మీ విద్యయంతయు ప్రదర్శించు సమయ మరుదెంచినది స్వామీ!”

“చిత్తము. అటులయిన నాకొకజాము వ్యవధి దయచేయవలెను. దివ్య ఓషధులు వారిచే సేవింపజేయవలయును. నేను దినదినము తమకిడు ఔషధములేగాక ఇంకను మూడురకముల చూర్ణములు అమృతఫలసురచే సేవింపచేయవలయు. వత్సాదని, సోమవల్లి, నిర్గుండి, శ్వేతసురస, మధూలికా, కర్పూరశిలాజిత్తు, ఇంకను హిమ పర్వతోద్భవములగు తొమ్మిదిమూలికలతోడను రచించిన మహౌషధమును తమ కర్పింప వలయును. అటువెనుక దివ్యలేపము తమఒడలికి అలందవలయును. ఇంత తతంగమైనగాని తామా బాలికను సందర్శింపకూడదు. తమకు ఏడు దినముల కొకసారి ఇచ్చు ఔషధములు, దేహలేపములు ఇప్పుడు చాలవు.”

“మంచిది స్వామీ! అవి యన్నియు చేయుడు.”

ఈ తతంగములన్నియు నెరవేరిన వెనుక, జామున్నర ప్రొద్దెక్కిన తరువాత శ్రీకృష్ణసాతవాహనుడు విషకన్యను చూడబోయెను. ఆతని హృదయము కొట్టుకొను చుండెను. ఆతని కేదియో వివశత్వము. ఆతని కెదియో మహామధుర పరీమళస్పర్శ.

ఆతడా బాలికను చూడబోవునప్పుడెల్ల ఈ దివ్యానుభూతి కలుగును. ఆ అరణ్యమున నా బాలిక తనకు పెన్నిధివలె దొరికినదని యువరాజు భావించినాడు. ఎన్నినాళ్ళు తానీ పవిత్రఫలమునకై ఆవేదనపడిన నాకు! ఈ బాలిక విషకన్యక యగుటయే తన తపఃఫలమా? ఈ బాలకై తా నింతకాలము ఎదురుచూచినది ఆ హిమబిందు నుద్వాహమాడుటకేనా? ఇప్పటికి రెండు మూడు తరములనుండి సాతవాహను లేకపత్నీవ్రతులై లోకారాధన మొనరించిరి. తనకుమాత్ర మిరువురు భార్య లేల?

ఆ విషకన్య దొరికిననాటినుండియు నీ యుద్ధయాత్రలో దన వెంటనే యున్నది. ఆమె శిబిరములు వేరు. పాములవారిని, విషవైద్యులను, ముగ్గురు నలుగురు పనికత్తెలను ఆమె సేవకై నియమించిరి. వారికిని విరుగుడు ఔషధముల సేవ సర్వకాలముల నుండవలయును. ఒక్కొక్క సేవకురాలు ఏడుదినముల కన్న ఆ విషకన్య కడ ఎక్కువకాలము సేవయందుండరాదు. సేవచేసి వచ్చిన సేవకురాలు రెండునెలలు వైద్య మొనరించు కొనవలెను. అందుకనియే విషవైద్యులు విషకన్యక కడ ముగ్గురికన్న ఒక్కొక్కసారి ఎక్కువ పరిజనులుండకుండ కట్టుదిట్టముచేసిరి.

వారందరు పాములవారి స్త్రీలే. అటులు వంతులుగా సేవచేయు వనితలు నలుబదిమంది ఏర్పాటు కావింపబడిరి. వారందరికి శుభ్రవస్త్రములు, ఆభరణములు ఒసగబడినవి. వారికి నాగరికత అలవరింపజేసినారు. ఒక మహారాజకుమారికడ నుండ ప్రతీ హారిణులవలె, చెలువులవలె వారప్రమత్తులై చరించుట నభ్యసించిరి.

విషకన్యకాంతికమున పనిచేయువారుగాక తక్కినవా రందరు, ఆ భవనమునందు వేరువేరు పనులు చేయవలెను. విషకన్యకకు వంటచేయుటకు ఒక బ్రాహ్మణ కుటుంబము నుంచిరి.

ఆనాడు శ్రీ కృష్ణసాతవాహనుడు విషకన్యకా దర్శనార్థియై పోవుచు “ఈ బాలికయా, హిమబిందా సాతవాహనరాజవంశమందు వధువుగ నడుగు పెట్టును!” అని ప్రశ్న వేసికొనెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 225 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)