పుట:Himabindu by Adivi Bapiraju.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఏమయ్యా, వృషభశకట పరీక్షయందు నీవే నెగ్గినావు. అన్నిట జయలక్ష్మి నిన్నే వరించుచున్నది. మా తమ్మునిగూడ రక్షించితివి. ఈ హారములన్నియు నీ మెడను వేయనీ. మా కుటుంబము నీ ఋణమునెట్లు తీర్చుకొనగలదు? జయ! ఆంధ్ర సామ్రాజ్య మహా మాండలికా! హిమబిందును రక్షించి మారాజ్య రమనే కాపాడితివి! మాకు అంగరక్షకాధిపతి వగుటయే కాదు, నిన్ను ఉపసైన్యాధ్యక్షునిగా నొనరించినాము. కాకుండకుల వారితో, సోమదత్తాచార్యులతో, వినీతమతి మండలేశ్వరులతో, అక్షఘ్నులతో, అఘబలులతో, చిత్రకులతో, జఘన్యులవారితో, సమవర్తితో సమానుడవైతివి. అఘబల ప్రభువును భరుకచ్చమున నుంచి వచ్చితిని. వారు లేనిలోటు నీవు తీర్చెదవుగాక!” అని శ్రీకృష్ణసాతవాహను డతిసంతోషమున నుడివెను. మహారాజు దంతావళమునుండి దిగి సువర్ణశ్రీ తనయశ్వము నధిరోహించి ఉప సైన్యాధ్యక్షచిహ్నమైన ఛత్రము, పతాకము ధరించు అంగరక్షకులు వెంటరా శ్రీకృష్ణసాతవాహనుని యనుమతిని సైన్యమును గురుడ ప్యూహముగా దీర్చి, మాళవుల దాకెను.

మాళవులు చక్రప్యూహారామమున ఉజ్జయిని చుట్టును ధట్టముగ గ్రమ్మి భేదవిధాన మవలంబించిరి. వారి సైన్యముల మొదటి శ్రేణిలో ఏనుగులు, వెనుక శ్రేణిలో ఏనుగుకు ఏనుగుకుమధ్య రథములు, ఆవెనుక అశ్వికులు, వారిని పొదివి వెనుకకు కాల్బలములు, వారివెనుక సర్వతోభద్రాదియంత్రముల దిబ్బలు, మహారథములు నుంచిరి. ఈ మహారథములు పదియోను ఇరువది హస్తముల ఎత్తున నుండును. ఆ వెనుక ఆశ్వికులు, కాల్బలములు ఆ వెనుక ఏనుగులు, మరల కాల్బలములు, యంత్రముల, దిబ్బలు, మహారథములు, ఆ వెనుక కాల్బలములు, ఏనుగులు, మహాశకటములు. (మహా శకటములన పెద్దదూలములు. వానికి చక్రము లుండును. ఆ శకటము తోసుకొనిపోయి గోడలు, తలుపులు బద్దలుకొట్టుదురు.)

ఈ చక్రవ్యూహము పది గోరుతములమంద మున్నది. ఆ మందమున ఛురికవలె సోమదత్తుని సైన్యములు చొచ్చుకొనిపోవుచున్నవి. చక్రవ్యూహమటు ముక్కలు గానే ఇటు శ్రీకృష్ణసాతవాహనుని సైన్యముపై మాళవ సైన్యములు విరుచుకుపడినవి. ఆ మహాసంగ్రామ మభిసం పాతము గాక ఆహుయమై, సమితియై పోయినది.

ఒక్కసారిగా శ్రీకృష్ణసాతవాహనుపై పలువురు యోధు లురికిరి. ఆంధ్ర సైనికులు, యోధులు, వీరవరులు తమ వ్యూహమును వదలరు. వారి క్రమశిక్షణ లోకప్రసిద్ధము. వారు చెక్కుచెదరరు.

పలువురు యోధు లిట్లు కలిసి, మహారాజు పై బాణములు పుంఖాను పుంఖములుగా బరపిరి. అంగరక్షకులు నిలిచి పోరుచు ప్రాణములు వదలి పడిపోవు చుండిరి. అప్పుడంగరక్షకాధిపతియైన సువర్ణశ్రీ విరోధులందరకు నెచట జూచిన నచట దానే ప్రత్యక్షమగుచు, ఎడమచేతి భల్లమున పొడుచుచు, కుడిచేతి కత్తితో నరకుచు, తన కవచము తూంట్లుపడి గాయము లగుటకూడ గణింపక రక్తసిక్తాంగుడై మహారాజు గజమును రక్షించుచుండెను. అతని వెన్నంటి అంగరక్షక సైన్యము మహావిక్రమము చూపుచున్నది. మహారాజు చెవికంటలాగి వేసిన ఒక్కొక్కబాణము ఒక్కొక్క వీరుని ప్రాణము గొనుచున్నది.

అప్పుడొక మహాగజముపై నెక్కి శివస్వాతి స్వయముగ చక్రవర్తి ఏనుగును తలపడినాడు. ఆ ఏనుగులు రెంటికి మహాయుద్ధ మావహిల్లినది. తొండముల దాల్చిన

అడివి బాపిరాజు రచనలు - 2

217

హిమబిందు (చారిత్రాత్మక నవల)