“తామే పదివేలగోండు స్నేహితులంతటా యున్నారని నిర్భయమున వచ్చినాను. ఇదిగో వినండి....” అని హిమబిందు భరద్వాజ పక్షివలె కూతవేసినది. వెంటనే సంపూర్ణాయుధోపేతు లగు నలుగురుగోండు లట ప్రత్యక్షమైరి.
సువర్ణశ్రీ వారిని జూచి, నవ్వుకొని “ఈ రహస్య మెప్పుడు గ్రహించినావు? ఆ కూత నీ కెట్లు పట్టుబడినది?” యని ప్రశ్నించెను.
“మమ్ము గుహాబంధమునుండి విడిపించి తెచ్చినపుడు మీసాంకేతికము నేను వినలేదుకాబోలు! మహాబలగోండుడు నాకు గురుత్వముచేసెను. అన్నట్లు మీరెప్పుడు నాకు చిత్రలేఖనము సంపూర్ణముగ నేర్పుట? ఇంకను ప్రొద్దుపోలేదు. అదిగో, ఆ సెలయేటిగట్టున రాతిపై కూర్చుందుము. (గోండు భాషలో గొండులను జూచి) మీరుపోయి, ఈ పరిసరములనే కాచియుండుడు.”
వారిరువు రొక శిలాతలముపై కూరుచుండిరి. సువర్ణశ్రీ ఏమి మాటలాడ గలడు? హిమబిందు మూగనోముపట్టిన యాతని భావభరము నెఱింగి,
“శిల్పాచార్యా! నేను రచించిన ఈ పాట వినుడు” అని అత్యంత మనోహర స్వరమున.
| “కుసుమ మొకటి అర్చనకై | |
అని పాడినది.
ఆ పాట ముగియునప్పటికి హిమబిందు చిత్తవృత్తి యంతయు నాతని కవగతమైనది. ఆ బాల “శిల్పమూర్తీ! నీవు సర్వకళాకోవిదుడవు నీకు తెలియని రహస్యమేమున్నది! నాకు కొన్ని అనుమానములున్నవి. తీర్పగలవా?”
“హిమబిందూ, నా కేమి తెలియును? శిల్పరహస్యములు మా జనకుడు తెలుపు చుండ వినవలెను, సర్వకళలకు దేశికులు వారు.”
అడివి బాపిరాజు రచనలు - 2
• 214 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)