పుట:Himabindu by Adivi Bapiraju.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సైన్యములకు సోమదత్తాచార్యులు సేనాధిపతియై, ఒక మద గజముపై నధివసించి ముందుకు సాగిపోవుచుండెను.

మహారాజు సైన్యసమేతముగా బుద్ధమహాచైత్యమునకు, మహాబోధి వృక్షమునకు పూజలొనరించి ముందునకు సాగెను. ధర్మనంది విన్యసించిన ధర్మచక్రము నొకదానిని సార్వభౌముడు చైత్యమున కర్పించెను. చారుగుప్తుడును వేయి నారికేళములు, భూరిదానములు, లక్షదీపములు, నవలక్ష సువర్ణము లా మహాచైత్యమునకు, సంఘారామమునకు నర్పించెను.

ఆంధ్రచక్రవర్తి గయాక్షేత్రమందు మహబోధి చైత్యమందు పది దినములు ఆగినాడు. ఆ దినములలో మూడవదినమున హిమబిందును చోరులు తస్కరించి ముక్తావళీ దేవితో ఎత్తుకొని పారిపోయినారని వార్త వచ్చినది. ఆ వార్త వినినవెంటనే చారుగుప్తుడు “హా” యని నేల కొరగి మూర్చపోయెను.

16. నిర్వేదము

చారుగుప్తుని ఉపశమింపజేయుటకు ముఖ్యమంత్రి అచీర్ణుడు, సర్వ సైన్యాధ్యక్షుడు స్వైత్రుడు, చక్రవర్తియు, మూర్తిమంతులవారును గుడారమునకు వచ్చిరి. చారుగుప్తుని శిబిరము చక్రవర్తి శిబిరమునకు కొలది దూరముననేయున్నది. ఆ వర్తకుని శిబిరమున నాలుగు గుడారములున్నవి.

వీరందరికన్న ముందరనే ప్రక్కగుడారముననున్న శ్వేతకేతుల వారు పరుగిడివచ్చి వైద్య మొనరించి చారుగుప్తునకు చైతన్యము గలిగించిరి.

చక్రవర్తి: మాకు నిన్ననే యీ వార్త వచ్చినది. మేము నెమ్మదిగ చారుగుప్తులవారికి యీ వార్త విన్పింపదలచితిమి. ఇంతలో ఎవరీ వార్తను తీసుకువచ్చినది?

చారుగుప్తుడు: (నీరసస్వరమున) ప్రభూ! ఇంద్రగోపుడు గూఢచారులతో మాటలాడుటవలన నీ విషయమును తెలిసి అత్యంత భయము నంది, నా కడకు పరుగిడివచ్చి చెప్పినాడు.

మహామంత్రి: చారుగుప్తులవారూ! మరేమియు భయపడవలసిన అవసరము లేదు. పదివేల సైన్యము ఆ దొంగలను వెంబడించినారట. ఆ దొంగలు మంజుశ్రీని ఎత్తుకొనిపోయిన స్థౌలతిష్యులవారి శిష్యగణములై యుందురు.

సేనాధ్యక్షుడు: స్థాలతిష్యులవారివలన నీ పని జరిగియున్నచో ప్రాణమానములకు ఏమియ భయముండదు.

మూర్తిమంతులు: దేశములన్నియు తిరిగినవారు, సముద్రములను మోకాలి బంటిగ నొనర్చుకొనినవారు మీరు ఇంత బేలలైతి రేమి?

చక్ర: చారుగుప్తులవారూ! మన మీ పాటలీపుత్రముపై దండెత్తుట మాని, సకల భారతదేశము గాలించి మీ తనయను పట్టుకొందుము. మా కనుమతి నిండు.

శ్వేతకేతులవారు: నా కేలనో హిమబిందునకు ఏ ఆపదయు రాదనియు, కొలది దినములలోనే ఆమెను మనవా రెవ్వరో రక్షింతురనియు అటు వెనుక మనలను ఇచ్చటనే ఆమె త్వరలో కలుసుకొనుననియు తట్టుచున్నది. నా కిట్టి ఆలోచనలెప్పుడు వచ్చినను అవి నిజమగుచుండును.

మూర్తి: నా తమ్ముడు గొప్ప జ్యోతిష్కుడు. ఆతడు చెప్పినచో తప్పదు.

అడివి బాపిరాజు రచనలు - 2

199

హిమబిందు (చారిత్రాత్మక నవల)