పుట:Himabindu by Adivi Bapiraju.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ మరుక్షణమున నది కీవ లావల గట్లపై, శిలలపై, కొండచరియ లపై వేలకువేలు గోండులు, రాక్షసులు మూగిపోయినారు. పది పన్నెండు తెప్పలు నది కెగువ దిగువలనుండి వేగముగ తెడ్లచే, వెదురుగడలచే నడుపబడుచు వీరి తెప్పవైపు పరుగిడివచ్చుట కారంభించినవి.

ఈలోననే మహాబలగోండుని తెప్ప గుహాముఖమునకు బోయెను. అచ్చట నీళ్ళలో ముక్తావళీ దేవిని పట్టుకొని ఈదయత్నించుచు ముణుగుచు దేలుచున్న సువర్ణశ్రీని, హిమబిందును, వీరిని ముంచ ప్రయత్నించు నా రెండవ రక్షక భటుని సొరంగముఖమున గట్టుపై కాగడాలతో నీటిలోని మనుష్యులను, స్త్రీలను పట్టుకొనప్రయత్నించువీరులను, నీటిలోనికి ఉరుకు వీరులను మహాబలగోండుడు చూచెను. తెప్పను గుహలోని వారును చూచిరి.

తెప్పమీదవారిని నాశనము చేయుటకు ధనుస్సు లెక్కుపెట్టియున్న గుహలోని వీరులు కొందరు బాణములను వదలిరి. నలుగురు గోండులు ఆ బాణములు మొఖమున, ఎదురు రొమ్మున, భుజమున తగిలి క్రిందకు కూలిపోయిరి. ఒకడు నీటిలోనికి శవమై దొర్లిపోయెను.

ఇంతలో వేరొక తెప్ప గుహాముఖమునకు వచ్చెను. దాని వెనుక మరొక తెప్ప వచ్చినది. ఇవి చూచుటతోడనే కాగడాలు పట్టుకొనిన కొందరు క్రిందపడవేసిరి, కొందరు సొరంగములోనికి పారిపోయిరి.

మొదటనే మహాబలగోండునితెప్ప వచ్చుటఏమి, ఇరువురు మువ్వురు వంగి నీటిలో ముణుగుచు తేలుచు ప్రాణసంకటావస్థలోనున్న సువర్ణశ్రీని, హిమబిందును, ముక్తావళిని, రక్షకభటుని వారు తెప్పలపైకి లాగివేసిరి.

సువర్ణశ్రీ బారినుండి పారిపోవలెనని ప్రయత్నించిన రక్షకభటుడు నదిలోనికి ఈదుకొనిపోయెనుకదా! అప్పుడే నీటికడకు సొరంగమునుండి విరోధులు వచ్చిరి. వారు తారసిల్లుట గమనించి హిమబిందు చీర వెనుకకు విరిచికట్టి నీటిలోనికి ఉరికినది. నీటిలో ఈదుచు అమ్మమ్మను నీటిలోనికి రమ్మని కేక వేసినది.

అటు విరోధు లేమి చేసెదరో యను భయము? నిటు ఈదుట ఎరుంగని కారణమున నీటి భయము? ఏడ్చుచు గజ గజ వణకుచు ఆ గట్టు మీద ముక్తావళి కూరుచుండుట ఏమి, గుహలోనికి తెప్పయు, ఆమెకడకు విరోధులు ఒక్కసారి వచ్చిరి. ఆ భయముననే యామె నీటిలో దొర్లిపడి పోయెను. విరోధుని ఒక్కతోపుత్రోసి, సువర్ణుడు ముక్తావళీదేవికడకు ఒక్కబార ఈతలో ఉరికి ఆమెను పట్టుకొనెను.

ఆమె సువర్ణుని గొంతు గట్టిగ కౌగిలించుకొనినది. సువర్ణుడెంత గజయీతగా డయిననేమి, ముక్తావళీ దేవి గొంతు గట్టిగ పట్టుకొనినతోడనే మునిగిపోయి, ఒక్కఊపున పైకిలేచి, మరల మునిగి, మరల లేచునప్పటికి ఇరువురను తెప్పపైకి ఎవరో లాగివేసిరి. అదివరకే ఎవరో హిమబిందును తెప్పమీదికి లాగిరి. సువర్ణశ్రీయు, ముక్తావళియు సొమ్మసిల్లి పడిపోయిరి. వారిరువురును రెండు మూడు గ్రుక్కల నీరు మ్రింగియుండిరి.

హిమబిందేమియు చెక్కుచెదరక, మహాబలగోండు డిచ్చిన వస్త్రముచే దీర్ఘమగు తన తల కట్టును తుడుచుకొనకయే సువర్ణుని, ముత్తవను తుడుచుచుండెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 195 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)