పుట:Himabindu by Adivi Bapiraju.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమెకు దనకు నేమి సంబంధము? ఆకాశమున దివ్యదర్శనము దోచినది. అప్పుడే మాయమైనది.

తానట్టి సన్నివేశము కోరెనా? ఏల తనకా దివ్యదర్శనము కావలెను? దూరదూరము నుండియే పవిత్రాద్భుత సౌందర్యమును, రసజ్ఞ తపఃఫలమైన దానిని పూజించుకొను చుండియుందునే? తనకడ కామె నన్ను ఏల రానిచ్చినది? ఏల ప్రేమించినది? ఇంతలో నీ ఎడబాటేమి?

లోకములో సౌందర్యానేకశ్రుతులు శిల్పి సమీకరించుకొనును. ఒకచోట కన్నులు, ఒకచోట మోము, ఒకచోట హస్తములు, ఒకచో పాదములు, ఊరువులు, కటి, వక్షము వేరువేరు స్థలముల సుందరులయందు ప్రత్యేకముగ శిల్పి పరిశీలించును. దోషములు త్రోసివేసి వానిని ప్రమాణములు చేసికొనును. అటులుండ ఏ అపశ్రుతియులేని మొక్కవోని అపరాజిత సౌందర్య మొక యెడ భాసింప, నా దేవి స్వప్నగతజీవి యగుశిల్పికి ప్రత్యక్ష మగుటయా? అతడు రాశీభూతమైన ఆ అలౌకికసౌందర్యము సన్నిహిత మొనర్చుకొనలేక పోవుటా? “సువర్ణా! నీ వెఱ్ఱికాని ఆంధ్ర సింహాసన మెక్కదగిన ఆ దేవి యెక్కడ? శిల్పిమాత్రుడవు నీ వెక్కడ? ఆ దేవిసౌందర్యశ్రీని వేభంగుల శిల్పించుకొమ్ము. లోకమెల్ల నా సౌందర్యముతో నింపుము. నీ జన్మమున కదియే చరితార్థత” అనుకొని అతడు నిట్టూర్పు విడిచెను.

హిమబిందు తా నెటులైన వెదకి, యామెను శత్రువుల బారినుండి రక్షించి వణిక్సార్వభౌముడు చారుగుప్తున కప్పగించు పుణ్యము లభించునా? సార్వభౌముని సైన్యము లీయడవులలో నాశనమైనివో, వెనుకకుబోయినవో ఇంకను యుద్ధము చేయుచు ముందునకు వచ్చుచున్నవో?

చారుగుప్తున కా సౌందర్యనిధిని అప్పగించి తాను హిమాలయములకు పోవుట మంచిది. శాక్యసింహజనన పవిత్ర ప్రదేశముల దర్శించి, ఆ పవిత్రహిమాలయములలో నివసింపనిచో నా యారాధ్యదైవతము నారాధించి, రూపెత్తించు మనస్సమాధి తనకు లభింపదు. ఆ దేవిని గండరింప గన్నచో మహోజ్వల మూర్తికి భరతఖండమంతట నీరాజనము నెత్తింపగన్నచో, నపుడుకదా ఆ దేవి తన్ననుగ్రహించినదానికి ఫలము లభించుట, ఆ దేవి తన కింక నేమి వరమొసంగగలదు! తద్వారస్వీకృతికి అర్హత సంపాదించు కొనుటయే తనపని.

ఇంతలో, ఆ ఆలోచనామధ్యమున నీటిలో అస్పష్టధ్వను లొనరించుచు కొండచరియ క్రీనీడలో ఒక పడవ చనుచున్నట్లు చప్పుడు విననయ్యెను. సువర్ణుని యాలోచనలన్నియు ఆ ధ్వనివైపు తీక్షణతో ప్రవహించినవి. అతడు నెమ్మదిగా భూమిమీద వ్రాలిపోయెను.

ఆ పడవ నది ఈవలి వైపునకు దాటి, సువర్ణశ్రీయున్న కొండచరియ గట్టు క్రింద నాగిపోయెను. నెమ్మది నెమ్మదిగ సువర్ణశ్రీ జరిగి జరిగి పది హస్తముల దూరముననున్న నదీకూల శిలాతలమునకు బోయి, నదిలోనికి తొంగిచూచెను. క్రింది పడవగాని మనుష్యులు గాని కనబడలేదు. ఇంద్రజాలముచే వలె వారందరు మాయమైపోయిరి.

ఏమిది ఈ చిత్రము? ఏమైపోయిరి తనకు కలవచ్చినదా, లేక భ్రాంతి కలిగినదా? ఏమి జరిగెను? ఆతడు కన్నులు చిల్లులుపడ ఆ చీకటి లోనికి చూచుచుండెను. రెండు ముహూర్తములట్లు జరిగిపోయెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 186 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)