పుట:Himabindu by Adivi Bapiraju.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నర్మదానది నవోఢ. ఆమె భారతవర్ష దేవికి మణిమేఖల. ఆమె పాత్ర పూరితారుణ రాగరంజితావనతవదన. యమునాదేవి గంభీరచరిత్ర. ఆమె తరళనయన, ప్రేమ ప్రేంఖణిత మానస, కృష్ణభక్త్యంకిత, వినీల జలజనయన.

నర్మద అల్లరిపిల్ల. ఆమె నాట్యమాడును. కిరాతకన్యలతో ఆ అడవులలో దోబూచులాడును. అడవిపూలే అలంకరించుకొనును. అడవిలతల మేఖల నొనరించును. తీయని స్ఫటిక జ్యోత్నలలో, ఆ అడవిదారుల వనపత్రవస్త్రాలంకృతయై దీర్ఘకుంతలములు విరియబోసికొని, పురుకుత్సునకై వియోగ గీతికల బాడుకొనును. గంగానది మహావేగవతి, త్రిపథగామిని. పవిత్రాంబుపూరయై మానవజీవితములనే పూత మొనర్చును. ఆమె స్నిగ్థసితాంగ. ఆమె పుట్టుకయే మహారహస్యము. ఒకనాడు విష్ణుపాదముల జనించును. వేరొకనాడు మహేశ్వరజటాజూటస్థ యోగనిద్రపరవశ. ఒక దినమున జాహ్నవి, మరు దినమున భాగీరథి. ఆమె సాగరసింహాసన పట్టాభిషిక్తమహాసామ్రాజ్జి. వరణుని దేవేరి.

నర్మద భర్తనుజేరు దివ్యసంగమస్థలముకకు డెబ్బది యోజనముల దిగువను గౌతమి ఉద్భవించినది. ఆమె నర్మదను చెల్లీయని పిలుచును. కృష్ణ గౌతమినే చెల్లి ఏమి చేయుచున్నదని ప్రశ్నించును. వారి పెద్దక్కసింధునది. వార్తలు నర్మదయే గౌతమికి వినిపించును. సరస్వతీనది సంగీతమును వేసవిరాత్రులందు నర్మదా గౌతమీ కృష్ణా భీమరధీ తుంగభద్రావేణీ కావేరినదులు ఆలకించును. ఆమె వీణాస్వరముల మేళవించి తీయని గీతికల పాడును. గంగా యమునా శోణా బ్రహ్మపుత్రికా మహానదులు తన్మయురాండ్రై విందురు.

ఆనాటి రాత్రి వైశాఖపూర్ణిమ. వెన్నెలకరుళ్ళు విశ్వమెల్ల ప్రవహింపుచున్నవి. సువర్ణశ్రీ కుమారుడు గోండువేషముతో నర్మదానది తీరమున ఆ తెల్లని రాలలో రాయియై, నీడలలో నీడయై, నదీజలమువంక చూచుచు నదీకంఠ మహా సౌందర్యము గమనింపుచు గూరుచుండెను.

మహాబలగోండుడు, హిమబిందు నింతవరకు విరోధులు గొనివచ్చి ఇచ్చట మాయమైనారని సువర్ణునకుజెప్పి రాక్షసులచే నా ప్రదేశమంతయు, గాలించి వెదకింపనెంచి యాతని సప్రమత్తుడై యుండగోరి మాయమయ్యెను. ఇన్నాళ్ళ నుండియు మహాబలుని స్నేహమువలన ఆటవీ సంచరణ విద్య సువర్ణునకు చాలవరకు అభ్యస్తమయ్యెను. ఆతడు ఎంత ప్రమత్తతతో నున్నట్లు కనబడుచుండెనో, అంత జాగరూకతతో అన్ని సవ్వడులను వినుచుండెను. సర్వదిశలు పరిశీలించుచుండెను.

“హిమబిందూ, శిల్పదేవీ! నీ వేమైతివి? నీ వెట్టికష్టముల నందుచున్నావో? ఆగర్భ శ్రీమంతురాలవు, వర్ణనాతీత సుందరశ్రీ మూర్తివి. శిల్పులు నీ యందమును మూర్తింప గలరా? కవులు నిన్ను కావ్యమున బాడగలరా? దేవీ! ఏ మహావిధి మనల నిద్దర గూర్చినది. నీవు నాకడ లేకున్న నా హృదయము సౌందర్యదూరమగును. ఏ బాలికనో పెండ్లియాడి బిడ్డలగనుచు జీవితమును సముద్రతీరపు పఱ్ఱనేలవలె పరచి యుంచువానికి శిల్ప మెందుకు? కవిత్వ మెందుకు? గాన మెందుకు?” అని లోలోన అస్పష్టవాక్యముల గొణుగుకొన్నాడు సువర్ణశ్రీ.

 “ఈ యాత్ర నీకునై, ఈ మాహాటవిలోన,
ఈ గవేషణఫలము ఈవు నా కౌదువే?"

అడివి బాపిరాజు రచనలు - 2

185

హిమబిందు (చారిత్రాత్మక నవల)