పుట:Himabindu by Adivi Bapiraju.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. మృగపథము

గోండువన యువరాజగు మహాబలగోండుడును, సువర్ణశ్రీయును మహా వేగమున అడవులన్నియు గడచిపోవుచున్నారు. “అటవీ సంచరణము ఒక మహావిద్య. శత్రువునకు తెలియకుండ ప్రయాణముచేయవలెనన్న నీవు అటవీ మృగమైపోవలెను. ఆకులో ఆకువై, కొమ్మలో కొమ్మఅయి పోవలెను. నీవు పక్షివలె ఎగిరిపోవలెను. ఉడతవు, ఉడుమువు, పామువు అయిపోవలెను. నేను వెనుకనే నీకు ఈ విద్య చాలావరకు నేర్పితిని. నేను చెప్పినది చేయుము సువర్ణా!” యని మహాబలు డనెను.

“మనకు హిమబిందు వార్త ఎప్పుడు ఎక్కడ తెలియగలదు?”

“మా గోండు అరణ్యములు తక్క, తక్కిన అరణ్యములన్నియు ప్రస్తుతము విరోధులగు కిరాత జాతులతో నిండియున్నవి. వారికి తెలియ కుండ మావాళ్ళు మనకు సర్వవిషయములు తెలియజేయవలెను. మీ హిమబిందును వారీ అరణ్యములోనికే కొనివచ్చియున్న యెడల మన కా విషయము తెలియగలదు. ఆ గుఱ్ఱమువలన మనకు ఎక్కువ ప్రమాదము సంభవించునని, గుఱ్ఱమును నగరి గ్రామమునుండి గోండుమార్గమున గోండువనము పంపించుట మంచిదే అయినది.”

“గుఱ్ఱమునుబట్టి యానవాలు పట్టరా?”

“గుఱ్ఱము రంగు మార్చివేసినాము. కావున నీ గుఱ్ఱము నానవాలు పట్టలేరు. మే మా గుఱ్ఱమును ఎచ్చటనో తస్కరించి తీసికొనిపోవుచున్నామని మన ఎదిరికక్ష వా రనుకొనునట్లు చేసినాము.”

“నీవు నా మిత్రుడవని తెలిసిన వెంటనే నిన్ను వారు బాధలనొనరించెదరేమో యని భయపడుచున్నాను.”

“ఓయి వెఱ్ఱివాడా! నన్ను బాధలుపెట్టగల ఆటవికజాతి యున్నదా? మాకు భక్తులైన రాక్షసులజాతి యొకటి యున్నది. ఆ జాతివారు దండ కారణ్యగర్భమందు, కటిక చీకటి నాట్యమాడు ప్రదేశాలలో ఉందురు. వారి జోలికి వెళ్ళుటకు ఆటవిక జాతులలో నాగరికపుజాతులవారికి భయము. నాతో మనకు కనబడక నూరుగురు రాక్షసులు గట్టివా రున్నారు.”

సువర్ణశ్రీ మహాబలుడు మూడుదినము లా విధముగ ప్రయాణము చేసిరి. సువర్ణశ్రీ గోండు వేషము ధరించియుండెను. ఆతడు గోండు స్త్రీలద్దిన రంగు రంగుల కౌపీనమును ధరించియుండెను. రంగురంగు పూసల హారములు మెడను వ్రేలాడుచుండెను. దేహమంతయు వివిధవర్ణములతో విచిత్రాలంకరణ చేయబడెను. మోము పెద్దపులి ముఖము వలె వర్ణము లద్ద బడెను. చేతులకు వెండి దండ కడియములు, ఔషధీ మూలముల తాయెత్తులున్నవి. వక్షమున చిరుతపులి తోలు వలెవాటయ్యెను. తలపై రంగు రంగుల పక్షి ఈకెలు, రంగురాళ్ళు, గవ్వలు పొదిగిన ఎలుగుబంటితోలు కిరీటమునుండి పైకెగసి యాడుచుండును.

ఇంతలో వేగు గొనివచ్చిన పరిచారకునితో మహాబలగోండుడు మటలాడి, “అన్నా, హిమబిందును, ఆమె అమ్మమ్మను తూర్పు దండకాటవి దారినే తీసికొని పోయిరట” అని సువర్ణశ్రీ కెరిగించెను.

అడివి బాపిరాజు రచనలు - 2

* 172 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)