పుట:Himabindu by Adivi Bapiraju.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



4. శాపాభయముద్రలు

శ్రీకృష్ణసాతవాహనకుమారుడు మరునాడు ప్రభాతకాలముననే ఆఖేటనావ్యాజమున యుద్ధయాత్ర సలుపువాడై, రాత్రిద్వితీయయామమధ్య కాలమువరకు సంగీతలోలుడై యుండెను. ఒక సుందరి విపంచి మేళవించి మధురగీతముల నాలపించినది. వేరొక పాటలాధరి మురళిపై తరళరాగపూర్ణ కీర్తనల మ్రోయించినది, పద్మహస్త యోర్తు కాంస్య తాళములు చఱచినది. కలకంఠి యొకరిత మనోహరగానామృతశైవాలిని యైనది.

రెండవయామము పూర్తియగునప్పటికి రాజకుమారుడు లేచినాడు. సుగంధ తైలపోషితకరదీపికల దీపాంగనలు దారిచూప నాతడు శయనమందిరమున కేగి కలశాంభోధి సదృశ మగు తల్పముపై మేనువాల్చెను. ఆతడు వెను వెంటనే తీయని నిద్దురలో కనుమూసి ఒడలు మరచెను.

చీకట్లు ద్రవించి యామినీఫాలమున అలకలై, యమునావీచికలై మిన్నుమన్నా క్రమించి పరవడులెత్తినవి. చీకట్లురూపముమారి చైతన్య పూరితములై, మహిషములై, ఖడ్గమృగములై, కాల కరియూధములై పేరెములువారినవి. అవి యన్నియు మాయమైనవి. చీకట్లన్నియు కలిసి ఒక్కటే చీకటియైపోయినవి. ఆ చీకటి బరువు శ్రీకృష్ణసాతవాహనుని వక్షముపై ఆవహించి, ఆతని ఎదఱురొమ్ము ఎముకలు పిప్పియగునట్లు బరువెక్క నారంభించినది. నిర్మల నిద్రపరవశుఁడై యన్న ఆ యువకునికి భయంకర స్వప్న మొక్కటి ప్రత్యక్షమైనది.

కర్కోటక నాగేంద్రుడు తన శతవదనములనుండి నిప్పులు గ్రక్కుచు, కన్నులు భయంకర జ్వాలలుగా మహావేగమున శ్రీకృష్ణుని వైపు రాసాగెను. వీరుడగు నా రాజకుమారుడు ధనస్సు నెక్కిడబోయెను. అది ఎచ్చటను కనబడదు. ఖడ్గము దూయబోయెను. వట్టియొర మాత్రము దొరకినది.

ఆ భీషణోరగముబారినుండి తప్పించుకొనబోయి, పరుగిడలేక యాతడు పడిపోయెను. ఓ, ఓయను యార్తనాదము కంఠపుముడులలో మాత్ర మాగిపోయి గురగురలైనది. ఆతనికి చెమటలు పట్టి మెలకువ వచ్చినది. ఆ మందిరములోని సుగంధ తైలముల వెలుగు దీపములలో రెండు తక్క తక్కినవన్నియు నారిపోయినవి. సగము మందిరము చీకట్లమయమైనది. ఆ గుడ్డి వెలుగులో కాలసర్పమొక్కటి బుసలుకొట్టుచు ఎటుల శయన మందిరములోన ప్రవేశించినదో శ్రీకృష్ణసాతవాహనుని తల్పముకడకు చేరవచ్చుచుండెను. అ సర్పము కలలోనిదా, లేక నిజమాయని శ్రీకృష్ణుడాలోచించెను. భయమనునది ఎరుంగని యా రాచబిడ్డ నేడు గజగజవణంకెను. నోటమాటరాదు. పెదవులు, నాలుక, గళము పొడియారిపోయినవి. ఆ పాము కొట్టు బుసలలో అగ్నిశిఖలు కనిపించిన వా మహారాజునకు. ఆ క్రూరపన్నగము పన్నెండుపదముల పొడుగున నల్లనై, మహాకాళికావేణి వలె, మృత్యుపాశమువలె మిలమిలలాడుచు నాతనితల్పముకడకు వచ్చినది.

విభ్రాంతుడై చేష్టలుడిగి యా మహారాజు తల్పముపై నటులనే కూర్చుండి పోయినాడు. ఆ పాము చుట్టవేసికొనిపోయినది. అక్కడనుండి పడగ హస్తమున్నర పైకిఎత్తి నాల్కలు చాచుచు బుస్సనుచు కాటువేయ బోవుచు ఆడిపోవుచున్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 170 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)