పుట:Himabindu by Adivi Bapiraju.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతలో ఆమె కా నీలజలములం దా మూర్తి కరగిపోవుచుండుట కనుపించినది. ఆ మూర్తిని వెన్నంటి యౌవనతుషారార్ధ్రమును, ఉత్తమాలంకారధగద్ధగితమును, పరిపుష్ట పరీమళితాంగ సుందరమునైన వేరొక్క విగ్రహము ప్రత్యక్షమైనది. ఆ మూర్తి మోముమాత్ర మస్పష్టము.

ఇంతలో మహాగ్నికీలయొకటి గుప్పుగుప్పున మండుచు ఆ మూర్తిని చుట్టివేసినది. తత్కీలామధ్యమున మహానాగినీజిహ్వారూపమై, ప్రళయదిన మధ్యాహ్న చండభాను వినిర్గతభస్తియై తనమోము తోచినది. కొంతవడికి అన్నియు నిర్మలనీలప్రవాహసంక్లిష్టములై మాయమైపోయినవి.

ఆమెకు భయమువేసినది. కొంచెము వణకినది. ఇంతలో తామరమొగ్గలవలె పాటల వర్ణసుందరము లగునామె వేళ్ళను పరిశీలించుటకు కొన్ని మత్స్యములు వచ్చినవి. అవి ఆ విషకన్యపాదముల స్పృశించినవో లేదో వెంటనే గిజగిజలాడి ప్రాణములు విడిచి వెల్లకిలగా తెల్లగా తేలి కొట్టుకొనిపోయినవి. ఆ దృశ్యముచూడగనే మానససరోవర సంచరద్రాజ హంసికాకంఠమృదుల మగు నామెసువర్ణకంఠము బిగుసుకపోయి, పొడియారిపోయినది. ఆమె చటుక్కున పాదములు తీసికొన్నది.

ఆమెకన్నులు అత్యంతవిస్ఫారితములై భయరూపము తాల్చినవి. ఆ చిన్నిచేపలు చచ్చిపోయినవి. అవి ఎంత అందమైనవి! అవి ఎంత చిన్నవి! అవి మిలమిలలాడుచు, చిట్టితోకల నాడించుచు, ఇటు నటుతుర్రున పరుగిడుచు, రాత్రికాలముల తన కానంద మొసగు తారలకన్న అందములై ఆడుకొనుచుండినవి. ఇంతలో నవి మంత్రించినట్లు మడిసి పోయినవిగదా!

తాను ఎక్కడికిపోయిన అక్కడ అగ్నిశిఖలు బయలుదేరునా? తానును అర్జునుని వంటి భయంకరవిషోరగమా? తన్ను ఇతరులను చంపుటాకా తనతాతగారు పెంచినారు.

....ఆ నాడు కృష్ణవేణ్ణానదీతీరమున చూచిన ఆ పురుషుని ఆ బాలిక కౌగిలించినట్లు ఏ పురుషునైన తాను....చేతులతో చుట్టివేసిన.... అతడు ఈ చిన్ని చేపలవలె, మలయ నాగునివలె, చ.... ని.... పో.... వల.... సినదేనా?

ఆ బాలిక పేరు బాపిశ్రీ అనివిన్నది. బాపిశ్రీవలే ఒక పురుషుని తానును కోరుచున్నది. మలయనాగుని కౌగిలిఁ దాను కోరలేదు కాని తనకు ప్రియమును సమకూర్చు నందగాని దాను కోరి కౌగలించినను ఆ ప్రియుడు నిలువున కూలిపోవునా? ఆతనినేమి చేతురు? మలయనాగుడు మరల కనబడలేదు.

ఆమె ఇంక ఆలోచింపలేకపోయినది. ఎవరో తరుముకొని వచ్చుచున్నట్లు ఆమె అతి వేగమున మహానాగినివలె ఆశ్రమమునకు పరువిడి వచ్చినది.

“గగనీ! గగనీ! నాకు భయమువేయుచున్నది,”

“నీ కెందుకమ్మా భయము?”

“నేను ముట్టికొన్నవారు వెంటనే చచ్చిపోదురు. తాతగా రనినట్లు నాశనమైపోదురు.

“అదేమి తల్లీ అట్లందువు! నేను నిన్ను ముట్టుకొనినను నాశన మగుటలేదే?”

“నీవు నావలెనే ఆడదానవు. అందుకని నాశనముకావు.”

“మీ తాతగారు మగవారు! మరి వారు నిన్ను ముట్టుకొనుటలేదా?”

అడివి బాపిరాజు రచనలు - 2

• 140 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)