పుట:Himabindu by Adivi Bapiraju.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పవడములై, మసృణములగు ఆతని వేలి గ్రోళ్ళు పల్లవ కోమలములగు పాణితలముల క్రూరముష్టులచే గాయము లొనరించినవి. ముత్యములై సొబగునవ్వుల పూలమొగ్గలై, చంద్రకిరణముల సైదోడులగు ఆతనిదంతములు జపారుణము, కిసలయకోమలము నగు వాతెఱను నెత్రు లురలజేసినవి. బోనున పెట్టిన అరణ్య మృగములలె ఆత డిటునటు తిరుగాడ జొచ్చినాడు.

సైన్యములు బయలుదేరిపోయినవి. భేరీభాంకారములతో నీ సరికి గౌతమిని జేరియుండును. ఆ సేనలవెంటబోయి భగ్నము, శూన్యము నగు హృదయమును వీరరసమగ్న మొనర్పవలయు నను కోర్కె ఆతనికి బొడమినది.

సువర్ణశ్రీ గంభీరుడు. ఆతని హృదయము ప్రేమరసపూర్ణ మయ్యును హావభావములను వ్యక్తము కానీయదు. ఆతడు హితమితభాషి. ఎన్నడైన ప్రియులతో సుకుమారముగా మేలమాడును. చిన్ని చెల్లెండ్రతో మాత్రము అరమరలేక చరించును. ఆతనినెయ్యమునకు, దియ్యమునకు జెల్లెండ్రే ఆలంబనములు. గురులయెడ వినీతుడు. తన వృషభములు, శిల్పపుం బనిముట్లే ఆతనిలోకము. రసభావ వశంవదుడై తద్రుపసిద్ధికై తన్మయత్వమున దిరుగు నా భావుకునకు నేడీ సంకటము గలిగినది.

బొమ్మలపై మనసుపోదు. వృషభశాలకుపోయి తాను పెంచు చిన్న గిత్తలను, కోడెదూడలను గదిసి, వానితలతో దలనాని దుఃఖభారమును వానికి గొంత పంచిపెట్ట జూచెను. చెమ్మగిలిన కనులతో నవి యాతనిదెస గాంచి యూరకొన్నవి. శిల్పమందిరమున కేగి ఉపాస్య మగు దేవీమూర్తి కడ ప్రణమిల్లి, చేతులు మొగిచి “దేవీ! అనుగ్రహించినదాన వింతలో మాఱుమోమిడితి వేమి? ప్రసన్నవై, కరావలంబనమిడవా?” అని వేడి కొన్నాడు. “నీ సేవ మఱచెదనని తలంచితివా?" ఏ పనిచేసినను నీ సేవయే అనుకొన్నాను. సర్వకర్మలను నీ సౌందర్యముతో నింపవలయునను కొంటిని. సమస్తమున నిన్ను, నీయందు సమస్తమును జూతు ననుకొంటిని. నీ వింతలో ఈసుచెంది ఆగ్రహింతు వనుకోలేదు. నా ప్రేమభావమున కందితివని పొంగిపోవుచుండ నింతలో క్రుంగదీసితి వేమి? కానిమ్ము, దుఃఖముమాత్రము నాకెందుకు మార్గముకాదో చూచెదను. విరహాగ్ని పుటపాకమున నీ కింకను వన్నెలు దిద్దుదును. నీ యగాధసౌందర్యతలములు స్పృశించుట కిదియే మార్గమేమో!”

శక్తిమతీదేవి కుమారునిమార్పు చూచినది. ఆతడు పరధ్యానమున నుండుట వాడినమోము, యెర్రవారిన కన్నుకొలకులునై భోజనమునం దభీష్టము లేకుండుట గమనించినది. విద్యావంతురాలును, సాధుశీలయు, నిండు గుండెయునగు నామె ఆతడు హిమబిందును ప్రేమించుచున్న విషయము ఎరుగును. హిమబిందు తన యింటికి వచ్చినప్పుడు తనయం దెంత సౌహార్దము చూపినది! చనవు ప్రియమార సంచరించినది. సువర్ణ, ఆమెయు కలిసికొని స్నేహమున మాట్లాడిరనియు, దృఢనురాగపాశబద్ధులై రనియు నాగబంధునిక చెప్పినది. ఇప్పుడు వీనికి మరల నీ విచారమేమిటి? కృశించిపోవుచున్నాడు బిడ్డ, ఆమె నాగబంధునికను ప్రశ్నించినది.

శక్తి: సువర్ణ మనస్సు పాడుచేసుకొనుచున్నాడేమీ తల్లీ!

నాగ: నాకూ తెలియదు. అడిగినా మాట్లాడడు. ఏదియో పని వంకతో ఎక్కడికో పోవుచుండును. ఒక చిత్రము లిఖింపడు. శిల్పశాలకు పోడు.

శక్తి:మహాలిని పిలు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 130 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)