పుట:Himabindu by Adivi Bapiraju.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధార్థినిక పాడుటమాని గుమ్మముకడ నిలిచియున్న సహోదర సుందరమూర్తిని దరహాసముతో గమనించెను. చిరుగజ్జియల నిక్వణమును, మనోహర సంగీతమున తేలియాడి వచ్చు పాటవాగును ఆ యుద్యానవనమున నొంటిమై సంచరించుచు సువర్ణుని చకితుని చేసినవి.

“ఏమే బాలనాగీ, దారి యిమ్మనవే”

అను సాకూత వాజ్మాధుర్యము నేడాతని పులకింపచేసినది. “సువర్ణా! అల్లిబిల్లిగ నల్లికొన్న పచ్చని పొదలలో విడిపోయిన సకల గుణచాంపేయసౌరభము దిలకించెదవుగాక, కమలినీ సౌశీల్యము, మల్లికా శిశుత్వము, మాధవీలతా మాధుర్యము, దమన మరువ కౌషధీ సౌభాగ్యము దండకూర్చెదవుగాని ర” మ్మని వీణాపాణు లాతనిచెవికడ రహస్యముల తెలిపిన ట్లయినది.

సువర్ణుని చూచి హిమబిందు అట్లే నిలిచిపోయినది. ఏ సందర్శనమునకై ఇన్నినాళ్ళు తపం బొనరించుచున్నదో, ప్రయత్నపూర్వకముగ నుపాయములు వెదకినదో అది రూపొందినతోడనే ఆమెకు చెప్పరాని వివశత్వము కలిగినది. మలయ పవనాంకురములు తీగలై శరీరము నలుముకొనినవి. సుగంధవీచిక లామెపై విరిగి పోయినవి.

నాగబంధునిక గడుసుదనమున “అన్నయ్యా! ఈ అమ్మాయిని ఎరుగుదువుగా? చారుగుప్తదేవుని కుమార్తె, స్నేహితురాలు” అనినది.

11. సంకేతము

సాయంకాలమున ధాన్యకటకనగరమందున్న హిమబిందు భవనమునకు పెద్ద పెద్ద కుటుంబముల పుణ్యస్త్రీలు పేరంటకమునకు వచ్చిరి. సభామంటపమున కాశ్మీర కంబళులు పరచియుండిరి. సుగంధకరండములు మనోహరధూపముల వెదజల్లుచుండెను. ఒక మరకతమున దొలువబడిన గిన్నెలో పరిమళద్రవ్యములతో బాంధవము సలుపు మంచిగంధమున్నది. బంగారముతో, దంతముతో మలచిన అపురూప దారుపీఠముపై పూలపళ్ళెము లుంచిరి.

పుణ్యస్త్రీల పాదములకు చెలులు లత్తుకపెట్టిరి. తాంబూలము లిచ్చిరి. కలపము లలదిరి. పూవులనీరు జల్లిరి. పుష్పములు, ఫలములు మొదలగునవి వాయనమిచ్చిరి. కోకిల స్వనముల కొందరు చెలులు రాగము లాలపింప కొందరు మృదంగముల వాయించిరి. కొందరు వీణెల మీటిరి. అయినను హిమబిందు ఆ సంతోష సమయమున పరధ్యానయై యుండెను. సాయంతనమున కెవరిభవనములకు వారు యానములపై వెడలిపోయిరి. హిమబిందు తన అభ్యంతరమందిరమున నొంటిగా పవళించియున్నది.

ఆమె యెట్లయినను సువర్ణకుమారుని మరల చూడవలెను. ఆతని కన్నులలో తనప్రతిబింబ మెట్లుండునో! ఆతని నెట్లు చూచుట? ఆతని గనుగొనకుండ నుండలేదు.

ఆ మోహనాకారుని హస్తము తన భుజమున కంటినతోడనే యొడలు జల్లు మని మధురత్వ మేదో తన్ను ముంచివేసినది.

హిమ: బాలనాగీ, ఒకసారి యిటు రావే!

అడివి బాపిరాజు రచనలు - 2

• 106 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)