పుట:Himabindu by Adivi Bapiraju.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులపతియైన విశుద్ధలక్ష్యార్హతులు అమృతపాదులను తన హృదయానికి అద్దుకొని వేయిదేవతలబలము వచ్చినట్లు సంతోషించెను.

విశుద్ధలక్ష్యార్హతులకు యెనుబదిమూడేండ్లున్నవి. తాను నిర్యాణ మందిన వెనుక కులపతి తగినవాడు లేనిచో సంఘారామశిరోరత్నమైన ధాన్యకటకాశ్రమము బుద్ధమహాధర్మకము నిర్వహింప లేదని యా వృద్ధాచార్యుల భయము. నే డా భయము తీరిపోయినది.

శ్రీముఖ శాతవాహనచక్రవర్తి తమ వృద్ధ గురువును దర్శించుటకు వచ్చి, అమృతపాదుల దర్శించి వారికి దాసానుదాసుడై పోయినాడు.

అమృతపాదులు ధాన్యకటకమునుచేరిన రెండవయేట విశుద్ధలక్ష్యార్హతులు నిర్యాణ మందినారు. అనాటినుండియు అమృతపాదార్హతులు మహా చైత్యసంఘారామమునకు కులపతి యాయెను.

9. మాతృ హృదయము

హారాణి తన పాదములకడ మోకరిల్లినప్పుడు అమృతపాదార్హతులు ఆమె నాశీర్వదించి “అమ్మ! భర్తగారివెంట నీవును యుద్ధమునకు పోవుచున్నావని విన్నాను. పురుషులు స్వభావముచేతనే కఠినులు. వారికి యుద్ధము తప్పని పని. స్త్రీసహజ మగు భయముచే భర్తకొఱకు ఆందోళనపడుచున్నావు. భయములేదు. తల్లీ! సర్వము శుభపరిణామము చెందును.”

మహారాణి: స్వామీ! యుద్ధ మనిన ఆడువారికి భయము. స్త్రీ, అందును బిడ్డలతల్లి ప్రాణనాశమున కెప్పుడును ఒప్పుకొనదుకదా! ఈ భయం మావారికొరకే కాదు. యుద్ధములో నెందరో చనిపోవుదురు. ఎన్ని కుటుంబములో దుఃఖభాజనము లగును.

అమృత: నిజము తల్లీ! ప్రియదర్శియైన అశోకుడు కళింగదేశముపైకి దండెత్తి పోయినాడు. కాళింగులు పరాక్రమమున నాతని ఎదిరించిరి. ఘోరమైన యుద్ధము సంభవించినది. లక్షలకొలదిజనులు రణదేవతకు బలియైరి. అశోకుని యుద్ధములలో నంత జననష్ట మెప్పుడును వాటిల్లలేదు. అది యంతయు అశోకుని నిర్వేద మయ్యెను. అప్పుడాతనికి తథాగతులబోధ అర్థమైనది. ఆతడు భిక్షుమహారాజయినాడు. మహా శ్రమణకుని బోధలచే జగత్తునే కాంతిమంతము చేసెను.

మహారాణి: స్వామీ! యుద్ధమున దక్క మనుష్యులు తమ కాంక్షలను, వివాదములనువేరువిధమున తీర్చుకొనలేరా? చక్రవర్తుల ఈ రాజ్య తృష్ణ పాపపుణ్యము లెరుంగని దేవమూర్తులైన పసిపాపలపై విరుచుకొనిపడునుగదా!

అమృత: తల్లి! నీ మాతృ హృదయ మట్టిది. మంజుశ్రీని తస్కరించినవారు ఆ బాలునియందు దోష మెంచి అటుల చేయలేదు. ఆ బాలుని చక్రవర్తి బిడ్డవలెనే సాకుచున్నారు. ఎత్తుకొనిపోయినవారిహృదయము నాకిప్పుడవగతమైనది. ప్రజలొకప్పుడు మానవ ధర్మములు మరచిపోయి రాక్షసత్వము వహింతురు. కామదేవుడు వారికి ఎన్నియో ఆశలు ప్రత్యక్షము చేయును. వారాతని బానిసలై పోదురు. అప్పుడు అవతారమూర్తి యొకడుద్భవించును. తన జీవితముచే లోకసంగ్రహము చేయును, లోకము తరించును. సృష్టిచక్రమిట్లే సర్వకాలము తిరుగుచుండును.

మహా: ఆ సృష్టిచక్రమును త్రిప్పుటకు యుద్ధములే కావలయునా తండ్రీ?

అడివి బాపిరాజు రచనలు - 2

• 102 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)