పుట:Himabindu by Adivi Bapiraju.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహారాణి ఒక శుక్రవారము సాయంకాలము పరివారజనముగొలువ మహాచైత్య సంఘారామమునకు బోయినది. ఆమె రథము తోరణముకడ డిగ్గి పాదచారిణియై అమృత పాదార్హతాచార్యుల పటకుటీరమునకు బోయెను.

8. కులపతి

మృతపాదార్హతులకు కొంచె మెచ్చుతగ్గు ఏబదియేండ్లవయసుండును. శాంతమే రూపముపూనిన తేజోరాశి, విజ్ఞానసముద్రుడు, వేదవేదాంగ పారంగతుడు. త్రిపీటకములు, బౌద్ధదర్శనములు, జైననికాయములు, ఛప్పన్నభాషలును ఆ ఆచార్యునకు ముఖస్థములు.

ఐనను అమృతపాదులకు పదునేడు సంవత్సరముల పూర్వము నడిచిన తన చరిత్ర ఏమియు తెలియదు. ఆయన తల్లిదండ్రులెవ్వరైనది ఆయనకు తెలియదు. తన పేరెరుంగడు. తనగ్రామ మెరుంగడు. ఉపవీతమును, తక్కుంగల వేషమును ఆయన బ్రాహ్మణ జన్ముడని ఆయనను రక్షించిన బౌద్ధసన్యాసులకు తెలియ చెప్పినవట.

కుసుమపురమునకు పదునాలుగు గోరుతముల కెగువను గంగాతీర మున బుద్ధుని ప్రియశిష్యుడగు ఆనందుడు నెలకొల్పిన మహాసంఘారామ మొకటి యున్నది. ఆ సంఘారామవాసు లగు బౌద్ధసన్యాసులు కొందరు ఒక నాడుదయమున కాలోచిత స్నానము లాచరించుటకు వెడలియుండిరి. ఇంతలో ఒక భిక్షుడు “ఒహో” యని యరచి నీటిలో తన చేతికి దొరికిన యొక శవముజుట్టు పట్టుకొని యొడ్డునకు లాగుకొనివచ్చెను. తక్కిన నల్గురును ఆ కళేబరము నెత్తి నీటికి దూరమున పరుండబెట్టిరి. కాని ఆ శవమును పరీక్షించినకొలది వారి యాశ్చర్యము మిన్ను మట్టినది. అది శవము కాదు. లంబికాయోగముదాల్చి జలస్తంభన విద్యచే గాబోలు నీటియందు మునిగి, యా పురుషు డెవ్వడో నీటి మట్టమునకు దిగువ కొట్టుకొనివచ్చు కొన్ని తుక్కుపదార్థములలో చిక్కుపడి, ప్రవాహవేగమున వచ్చుచున్నాడు. ఆ దేహమునందున్న తేజస్సుచేకాబోలు మత్స్యాదికము లేవియు ఆ దేహము నంటలేదు. దేహము వెచ్చగనున్నది. నాడిలేదు. ఉచ్ఛ్వాసనిశ్వాసములు లేవు. కన్ను అరమూతలుపడి లోనివైపునకు తిరిగియుండెను. శిరముపై ఎదియో పెద్దగాయము తగిలి పుఱ్ఱె ఎముక పైన చర్మమును, కండయును పగిలియుండెను. పుఱ్ఱె ఎముక స్పష్టముగ కన్పడుచుండెను.

పవిత్రములు, అమృతముతో సమములు నగు గంగాజలములు ఆ గాయమును శుభ్రపరచి అందే దోషమును బ్రవేశింపకుండ కాపాడినవి. ఆ భిక్కులలో ఆయుర్వేద ప్రజ్ఞానిధియైన యొక సన్యాసి సప్తనాడులను పరీక్షించి హృదయస్పందన మాగిపోయినను రక్తము ప్రవహింపుచునేయున్న దని నిర్ధారణ చేసినాడు.

కాని ఆ పురుషుని ఆత్మశక్తి దేహమును రక్షించుకొనుచు మహా ప్రవాహమై ప్రవహించుచుండెనట.

ఆ భిక్కులు ఆ శరీరమును ఆశ్రమములోనికి గొనిపోయిరి.

ఆనంద సంఘారామమునకు పెద్ద యగు కులపతి మహాయోగి యగుటచే లంబికాయోగముచే స్థాణుత్వమునందిన యా పురుషునకు చైతన్యము కలుగజేయు మంత్రములు పఠించి ఓం! ఓం! ఓం! అని ప్రణవోచ్చారణ ప్రారంభించెను. ఓం, ఓం,


అడివి బాపిరాజు రచనలు - 2

• 100 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)