పుట:Himabindu by Adivi Bapiraju.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమబిందు

· చారిత్రాత్మక నవల ·

ప్రథమ భాగం

1. వణిక్సార్వభౌముడు

కృష్ణవేణీ ప్రవాహమున నీడ చూచుకొనుచున్న శ్రీ ధాన్యకటక దుర్గాధి లక్ష్మికి, వణిక్సార్వభౌముడగు చారుగుప్తుని మహాసౌధము శ్రవణావతంసమై విరాజిల్లుచుండెను. అచట కిన్నూరు ధనువుల దూరమందున్న మహాసంఘా రామచైత్యమును, చారుగుప్తుని సౌధమును చక్కదనమున నక్కా సెల్లెండ్రవలె నున్నవి. నున్ననై నిగనిగలాడుతూ పాలరాతిగోడలపై చిత్రించిన బుద్ధదేవ జాతక గాథలతో నలరారు చారుగుప్తప్రాసాదము కనులు చల్లజేయుచూ రూపెత్తిన శిల్పలక్ష్మివలె నున్నది.

చారుగుప్తుడానాడు వ్యాఘ్రాజినము పఱచిన దంతపుబీట పై నధివసించి, తూలికోపధానములపై నొఱగి, గోష్టపాలకుడగు నింద్రగోపునితో సంభాషించుండెను.

చారు: మన శూరనేత్ర సంజీవకములు ఉజ్జయినిలో పందెముగెలిచి, ఱేనిచే బంగారు కట్లబండిని బహుమానముగా దెచ్చినమాట నిజమేకాని, కామందక కుల పాలకముల కవి తీసికట్టే. మన జతల నన్నిటిని మా మేనల్లుడు, సమవర్తి, పరీక్షించి కామందక కులపాలకయుగళమే అన్నిటికి మిన్నయని తేల్చినాడు. సార్వభౌముని జన్మదినోత్సవము నాటి పందెములలో ఆ జతనే కట్టినచో మనకు జయము లభించునన్నాడు. మఱి, నీ యభిప్రాయమేమో!

ఇంద్ర: చిత్తము. తమ మేనల్లుడుగారా జత నిదివర కెన్నడైన బండి తోలి చూచిరా యని సంశయించుచున్నాను.

చారు: ఆ! రెండుసార్లు బండి తోలినాడు. స్నేహితుడగు శశాంక వసువుగారి మ్లేచ్ఛాశ్వముతో సమానముగ రెండు గోరుతములు[1] పరువెత్తెనట. విజ్ఞానకంఠీరవుడుగూడ సుళ్ళు, రూపురేఖలు పరిశీలించి ఉత్తమోత్తమములని నుడువుటచేతనేకదా ఈ ఎడ్లజతలకు పదునేనువందల పణాలిచ్చి, కొంటిని.

ఇంద్ర: చిత్తము. అయినచో అంత బలవత్తరమైన జతను మన సారథి నడపగలడా?

  1. సుమారు 1260 ధనువులు,
    ఇప్పటి 12 అణాల వెలగల వెండి నాణెము.


అడివి బాపిరాజు రచనలు - 2

• 1 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)