పదమూడవ ప్రకరణము
“హేమలతా! హేమలతా! ఇటురమ్ము” అని లోపలి నుండి యొక యెఱిగిన మనుష్యకంఠము వినబడిన తోడనే హేమలత వీధి గుమ్మమునుండి లోనికి బరుగెత్తి శివప్రసాదు వద్దకుబోయి “అయ్యా! ఎందుకు బిల్చినారు” అని యడిగెను. శివప్రసా దామెనుజూచి “అమ్మాయీ చక్రవర్తి చిత్తూరుపై దండువెడలుటకు సైన్యముల నానాభాగములనుండి పిలిపించుచున్నాడు. అందుచేత మనయూరిమీదుగ దుర్మార్గులగు రాజసైనికులు పోవుచున్నారు. నీవు వారికంట బడకుము. ఆయన నిన్ను నాకప్పగించినందులకు మరల నిన్ను నేనాయనకప్పగించి మాట దక్కించుకొనవలెను. నీవు వీధిలోని కరుగకుము.” అని హితోపదేశము చేసెను. హేమలత యామాటల గమనించి “వీధిలో నొక ముష్టివాడు చిత్రముగ బాడుచున్నాడు! అది వినుటకయి వెళ్ళినాను. ఇదె వాడు మనయింటికే వచ్చుచున్నాడు” అని హేమలత ప్రత్యుత్తరమిచ్చెను. హేమలత సాలిగ్రామమున రహిమానుఖాను ధాటి కోడి మూర్ఛిల్లియుండ నామెకు జ్వరము తగిలినపుడు మందు నొసంగి రక్షరేఖ గట్టిన గోసాయి యామెను మెల్లమల్లగా నావలకు దీసికొనిపోయి యొకబండిపై నెక్కించి తిన్నగా కుల్వానగరమునకు గొనిపోయెను. అచ్చోట దనకు బ్రాణమిత్రుడయిన శివప్రసాదునకు నామె నప్పగించి యత్యంత జాగ్రత్తగ నుండుమనియు, దాను వచ్చినపుడు గాని మదనసింగు వచ్చినప్పుడు గాని యామెనంపవలయు ననియు జెప్పి యాతడుచనెను. శివప్రసాదు పండితసంప్రదాయమున జేరిన బ్రాహ్మణుడు. అగ్రహారీకుడు. అందుచే ద్రవ్యవంతుడును, మాట చెల్లుబడిగలవాడును నై ధర్మకార్యముల జేయుట