ముఖ్యముగాదు. మనమురామని వారీవఱకే నిశ్చయించుకొని లక్ష్మణసింగుతో బైనమైపోయి యుందురు. లక్ష్మణసింగు వారిచేతబడ మదనసింగు మనచేతబడును. అందుచేత మనమీస్థలమును బాయవద్దు. మేమిరువురము వీధిలోనికరిగి వారు వచ్చుచున్నారేమో చూచివచ్చెదము” అని చిదానంద యోగి చెప్పి స్వాములవారు నొడఁబఱచి మదనసింగును గూడి వీధివైపు జని వారిట్లు మాటాడిరి.
చిదా – అబ్బాయి! ఈతని నిచట నేమిచేయుదుము? చంపివేయుట యుచితమగునా?
మద – నిరాయుధుఁడై యసహాయుడైన పురుషుని జంపుట శౌర్యమునకు దగిన కార్యముగాదు. కాబట్టి నేనీ క్షణమున మాపినతండ్రివద్ద కరిగి యాతని దోడ్కొనివచ్చి వీనింబట్టుకొని ఱేపుదయమున ఠాణాకు నప్పగింప బ్రయత్నించెదను.
చిదా – ఈ యుపాయము చక్కగా నున్నది. నీవు మీ పినతండ్రి కడ కరుగుము. నీవు వచ్చినదాక నేనిచట నుండెదను.
అని పలికి యోగి మదనసింగునంపి స్వాములవారు దాటిపోకుండ దానచ్చట గావలి యుండి ప్రతాపునిరాక కెదురుచూచుచుండెను. మదనసింగును వడిగ నింటికిఁజని తన రాకకు నిరీక్షించుచున్న పినతండ్రికడ కరిగి సపరివారముగ నాతని వెంటబెట్టుకొని యారాత్రి జరిగిన వృత్తాంతముల రహస్యముగ నాతనికిఁ జెప్పుచు స్వల్పకాలముననే కుటీరమువద్దకు వచ్చెను.
ఈ నడుమ చిదానందయోగి లోపలికరుగ “వారు వచ్చుచున్నారా?” యని స్వాములవారడుగ యోగి వారి నిమిత్తము మన బ్రాహ్మణ కుఱ్ఱవాని