పదునొకండవ ప్రకరణము
అట్లు లక్ష్మణసింగును మఠమునందు విడిచి మదనసింగును చిదానందయోగియు నవశిష్ట కార్యములను సమాప్తినొందించుటకు దమప్రయాణమును మరల నారంభించిరి. ఈ పర్యాయము చిత్తూరునగరము యొక్క పశ్చిమ భాగమునకు బోవలసియుండెను. వారు ప్రయాణమైపోవునప్పటికి రమారమి జామున్నర ప్రొద్దుండెను. అప్పటికి వీధులు నిర్మానుష్యముగ నుండుటచే వారిరువురును మునుపటికంటె వడిగనడిచి పెక్కుసందుల తడచి కొంత సేపటికి విశాలమైన బౌద్ధమఠము సమీపమునకు వచ్చిరి. రాజస్థానము నందాకాలమున బౌద్ధమతవ్యాప్తి లేదు గాని తన్మతము భరతఖండమునకెల్ల బ్రధానమతమై యుండునప్పుడు చిత్తూరు నందీ మఠము నిర్మింపబడినది. మనము వ్రాయుకాలమున బౌద్ధులనివాసము చేయుట లేకున్నను దాని పురాతన నామముననే యది పిలువబడుచు వచ్చెను. అందు సన్యాసులును యోగులును ప్రయాణవశమున నొకటి రెండు దినములుండి పోవుచుందురు. మనకపట బ్రాహ్మణుడును యోగియు మఠద్వారమునకు జని లోపల బ్రవేశింప బోయిరిగాని యొక సేవకుడు వారిని గదిమినిలిపెను. మదనసింగంతట నిలువక సేవకుని నొకచేతితో ద్రోసి యోగితో గూడ గుమ్మము దాటగా నాసేవకుడు వారి కడ్డుబోయి వారితో నిట్లు మాటాడెను.
సేవ — మీరెవరు? ఈమఠమునందు మీకేమి పనియున్నది?
మద — ఇక్కడ మా స్నేహితుడున్నాడు. ఆయన నిమిత్తమై వచ్చినాము.