పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

53

అతని నుచితగౌరవముతోఁ గూర్చుండ నియమించి చక్రవర్తి యాకాగితములనిచ్చి చదువుమనెను. ఆతఁడును నామూలాగ్రముగ వానినెల్ల దనలో జదువుకొని యైదుకాగితములనియు నైదవది మాత్రము ముఖ్యమైనదనియు జెప్పి దాని నిట్లుజదువ నారంభించెను.

“శ్రీ సూర్యకుల ప్రదీపకులగు భీమసింగు మహారాజు వారికి దేవగిరి రామదేవు నమస్కారములఁజేసి వ్రాయుచున్న దేమనిన ఈమధ్య మీకును, గ్రూరుఁడైన యల్లావుద్దీను చక్రవర్తికిని మనస్పర్ధలు గలిగినట్లును, జిత్తూరు రాజ్యముపై నతడు దండెత్త నూహించినట్లును మేము వినుచున్నాము. అది నిజమగునేని మిగుల విచారము నొందుచున్నాము. ఈవఱకు దక్షిణ హిందూస్థానమునకు వచ్చి మమ్మాతఁడోడించుట మీరు వినియుందురు. సమానాపదలోనున్న మన మిరువురమును క్షత్రియ కులజులము నేక దేశీయులము నగుటచే నన్యమతస్థుడు దూరాచారుడునగు చక్రవర్తిపై గలిసి యుద్ధముచేసిన పక్షమున గెలవకపోము. పౌరుషధనులు నభిమాన సముద్రులు నగు మీకు మేము దోడ్పడినయెడల దైవానుగ్రహమువలన ఢిల్లీనుండి మ్లేచ్ఛులను బాఱదోలవచ్చును. మ్లేచ్ఛుడగు చక్రవర్తి దురాచారుడగుటచే స్వబలమునందనేకు లతని కనిష్టులుగ నున్నారని విని సంతోషించుచున్నాము. మీ దేశముమీఁద దండయాత్ర ముందుగ జరఁగునేని మాబలమును మీకు సాహాయ్యముగ నంపెదము. అది యింతట జరుగదేని మాకు మీరు సహాయము చేయుడు. నీతి విశారదుడగు నీ యోగి మనకుత్తర ప్రత్యుత్తరముల దెచ్చి యిచ్చుచుండును. దీనికి వెంటనే యుత్తరము నంపఁగోరుచున్నాను. త్వరపడవలయు.

రామదేవు వ్రాలు”