పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేనవ ప్రకరణము

ఆ మఱునాడు పద్మినినైన పద్మినిప్రతిబింబమునైన నొక పర్యాయము రాజపుత్రులు తను జూడనిచ్చినయెడ ముట్టడిమాని పోవుటకు జక్రవర్తి సమ్మతించిన వర్తమానమునంపెను. అందువిషయమై దర్బారుజరుగ నందుజేరి సామంతులతో గొందఱదియు నవమానకరమని వాదించిరి. మఱి కొందరద్దములో బద్మినీదేవినీడను జూపుట యవమానకరము కాదని యభిప్రాయపడిరి. స్వకులక్షయమునకును దేశనాశనమునకును భీమసింగు వెఱచి తనభార్యయొక్కనీడను జక్రవర్తికి జూపుటకు నియ్యకొనెను. కాని యా చక్రవర్తి యొకడె రావలయునని కట్టడిచేసెను. రాజపుత్రులు నిరాయుధుడుగను నిస్సహాయుడుగ నున్నవానిని వధింపరన్న దృఢవిశ్వాసముతో జక్రవర్తి కామాంధకారముచే గనులు కానక రహిమానుఖాను నొక్కని వెంటబెట్టుకొని కోటజొచ్చెను. చక్రవర్తికి దగిన గౌరవముల నొనర్చి భీమసింగు తన భార్యనీడ నొక యద్దములో బ్రతిబింబమగునట్లుచేసి యాతనికి జూపెను. నీడనో జగన్మోహనాకరము దాల్చియున్న యా త్రిలోకసుందరియగు పద్మిని నిజముగ నెట్లుండునోయని యద్భుతపడి సంతుష్టాంతరంగుడై పిమ్మట గోటవెడలిపోవుటకు జక్రవర్తి సిద్ధమైయుండెను. ఆసమయమున జక్రవర్తియు భీమసింగును నిట్లు మాటాడిరి.

చక్ర – నేను మీరుచేసిన మర్యాదలకు జాల సంతోషించి నాడను. ఈ వఱకు నేను మిమ్ముజేసిన యవమానములకు నాకు విచారమగుచున్నది. ఇక ముందు మీరును మేమును స్నేహితులమై యుండవచ్చును.