పుట:Gurujadalu.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



“శివుడూ, విష్ణూ పీర్లే అయినప్పుడు, బుద్దుడు శివుడు కారాదా?” అని శాయన్న భుక్త కథ పరిసమాప్తి చేశారు.

మా గురువు గారు యీ చరిత్రకు చాలా ఆశ్చర్యపడి అన్నారు. “ఔరా! కలికాలంలో మనుష్యులే కాదు - దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారు.

“అయినా తప్పేమి? శివుడన్నా, విష్ణన్నా, పీరన్నా బుద్ధుడన్నా ఆ పరమాత్మ మట్టుకు ఒక్కడే గదా?” వెంకయ్య వూరుకుంటాడా, “అందరు దేవుళ్ళూ వక్కరే అయితే, ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?” అన్నాడు.

అంత గురువుగారు “ఓరి! దేవుళ్ళని పీనుగులంటావురా? నువ్వు వొట్టి కిరస్తానువి - యింకా కిరస్తానుకైనా దేవుడంటూ వున్నాడు; నువ్వు కిరాతుడివి. పీరో, బిట్రో, దెయ్యమో, దేవరో, యీ అజ్ఞులకు మూఢభక్తి అయినా వుంది. నువ్వు అందరు దేవుళ్ళకీ ఒక పెద్ద నామం బెట్టావు.

“ఒక్క మీకు తప్ప శాస్తులు గారూ”, అన్నాడు.

“నీ జన్మానికల్లా విలవైన మాట అంటివిరా” అని నే అన్నాను.

(ఆంధ్రభారతి, 1910 ఏప్రిల్, మే, జూన్ సంచికలు)

గురుజాడలు

543

మీ పేరిమిటి?