పుట:Gurujadalu.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతా చల్లారగానే అటక మీద నుంచి కృష్ణమాచార్యులు దిగాడు. కష్ట సాధ్యమును సాధించిన సంతోషముతో, నాంచారమ్మ కరదీపం తిరిగి చేతపూని, యింటికి సవిలాసముగా నడిచిపోవుచుండగా, పెనిమిటి యెదురైనప్పుడు ఆమె ప్రేమ పరిహాసములు పెనగొను దృష్టితో చూసెను. ఆ దృష్టి తనకు దేవత్వమిచ్చి తన్ను అవతార పురుషుణ్ణి చేసిందని కృష్ణమాచారి మర్నాడు నాతో చెప్పి, ఆ అర్థంతో శ్లోకం రచించాడు. తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతో చేప్పితేనే గాని కొందరికి తనివి తీరదు.

ఆ రాత్రి శివాచార్లు గుండం తొక్కడం చూడ్డానికి నేను వెళ్ళివుంటిని. తెల్లవారగట్ల నాలుగు గంటల వేళ చిరిచీకటిలో గుండంలో నిప్పులు కణకణ లాడుతుండెను. ప్రాతఃకాలపు శీతగాలి సాగింది. ఒక్క పెట్టున గర్భ నిర్భేదమయ్యేటట్టు శంఖాధి వాద్యములు రేగాయి. ఇంగిలీషు చదువుకున్న నాస్తికాగ్రేసరులకు కూడా ఆ కాలమందు బితుకు కలిగిందని వారే వొప్పుకున్నారు.

పందిటిలో నుంచి వీరగంధాలు పూసుకున్న నలుగురు శివాచార్లు గుండం దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ఒకడు నెత్తిమీద భీకరమైన రాగి ప్రతిమ పెట్టుకున్నాడు. యెదురుగా నిలిచి మరి వకడు కత్తి ఝళిపించుచూ వీర వాక్యాలు కొలిపాడు. ఒకడు గుండంలో నెయ్యిపోసి గుమ్మిడికాయ తుండలు గుండంలోకి విసిరాడు. వెంటనే శివాచార్లు గుండం జొచ్చి నడుచుకు పోయినారు. అవతల వొడ్డు చేరి తిరిగి తొక్కుటకు వారు యిటు అభిముఖులై యుండగా, “అల్లా-రామ్" అని కెవ్వుమని ప్రళయమైన కేక ఒకటి వేచి, తక్షణం శివాచార్లు గుండం దిగిన వేపు నుంచి, మూకను చీల్చుకుని ఒక మనుష్య ప్రవాహము గుండము దాటుకుని పోయింది. వారిలో అందరున్నూ ముఖముల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ మనుష్య ప్రవాహమునకు అగ్రమందు వెండి పీరు వకటి రెండు చేతులా పట్టి ఒక వీరుడు భీముని వలే నడుచుకుపోయి నాడు. యిది అంతా అర నిమిషం పట్టలేదు.

మూక, చకాపికలై చెదిరిపోయినది. కొందరు సాతాన్లకీ, శివాచార్లకీ కూడా యత్కించిత్ కాళ్ళు కాలాయి. అది భక్తిలోపం కింద కట్టారు. తరువాత శరభయ్యకీ, మనవాళ్ళయ్యకీ రాజీనామా అయినదని అనుకుంటారు. పైకి మట్టుకు దెబ్బలాడుతున్నట్టే వుంటారు.

అదుగో, మా యింటికి యెదురుగా ఆ రచ్చసావిట్లో నిలిపిన పీరు ఆ పీరే. నాటినుంచీ, ప్రతి సంవత్సరం ఆ పీరుకు పండుగ చేస్తారు. వూరు ఆబాలగోపాలం శైవ వైష్ణవ భేదం లేకుండా పీరు దేవరకు మొక్కులు చెల్లిస్తారు. త్రిశూలాకారం గనక ఆ పీరు శివపీరే అని శరభయ్య అంటాడు. కేవలం రామస్వామివారి నామం గనుక విష్ణుపీరని మనవాళ్ళయ్య వాదిస్తాడు. ఆ వ్యవస్థయేదో వెంకయ్య పంతులు గారే చెయ్య సమర్థులు.

గురుజాడలు

542

మీ పేరిమిటి?