పుట:Gurujadalu.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మునసబు “ముసలాయన యిగ్గరాలట్టుకుని గుండం తొక్కేదేటి? సిన్నసోవిఁని లెగదీసుకెళదాం, రండి” అన్నాడు.

“వాడి జోలికి వెళ్ళకండి. మా బాగే; వుత్సవ విగ్రహాలు పట్టుకుని, నేనే గుండం తొక్కుతాను. మా వాడు పట్ణం వెళ్ళాడు. వూళ్ళోలేడు” అని రంగాచార్యులు గారు అన్నారు.

“అయితేలెండోయి!” అని మనవాళ్ళయ్య బొబ్బ వేశాడు. అంతట ఆ రావి చెట్టు మాను చాటున గప్పునీ ఒక వెలుతురు పుట్టింది. అందరూ భీతిల్లారు. నిషాలు దిగజారజొచ్చాయి. వెంటనే మాను వెనక నుంచి, ఒక చేత కరదీపము, రెండవ చేత సూరకత్తి, పట్టుకుని, వుంగరాల జుత్తు గాలికి తూగులాడుతుండగా, నిబ్బరంగా అడుగు వేసుకుంటూ వచ్చి నాంచారమ్మ, మామగారి పక్కను నిలిచి, ఆయన రెక్కలు పట్టుకుని వున్న నాయల వంక బాకు మొన జూపి దుష్టుల్లారా! యీ పరమ పవిత్రమైన బ్రాహ్మణ్ణి వొదుల్తారా, బాకుకు బలి యిచ్చేదా?” అని అడిగినది.

హటాత్తుగా వచ్చిన యీ వీర రూపమును చూచి, అందరి ధైర్యాలూ అడుగంటాయి. అయ్యవార్లంగారిని పట్టి నిలిచిన నాయలు బెదిరి దూరం సాగారు. అంతట ఆమె చేతి దీపం రచ్చ రాతిమీద వుంచి, “నీకేం కావాల"ని మనవాళ్ళయ్యను అడిగింది. మనవాళ్ళయ్య రెండడుగులు వెనక్కివేసి, తనకేమీ అక్కరలేదన్నాడు.

“నీకు ఉత్సవ మూర్తులు కావలెనంటివే".

“నాకెందుకు తల్లీ, అపవిత్రుడను; వాటి యెత్తు బంగారం కరిగి యిస్తే నాకు అక్కర్లేదు. రామినాయడు యేమో కొంచం -”

ఆమె అటుంచి యిటు తిరిగి, రామినాయడిని నిస్సాకరంగా చూస్తూ - "నీకేం గావాలి, మునసబు సోయగా” అని అడిగింది.

మొహం వొంచి, రామినాయడు తనకేమి అక్కర్లేదని పైకి చెప్పి. “ఆడదాయితో యవడు . మాటాడగల్గు?” అని గొణుగుకున్నాడు. రామినాయుడి పెళ్ళాం గయ్యాళి.

నాంచారమ్మ - యెవరికీ యేమీ అక్కరలేకుంటే యీ ముసలి బ్రాహ్మణ్ణి వొంటిమీద బట్టయినా లేకుండా నిద్దర మంచం మీంచి యెందుకు యీడుచుకువస్తిరి? యెవడూ మాటాడ్రేవిఁ?”

రామినాయడు కొంచం ధైర్యం తెచ్చుకొని, “ఆడదాయితో మాటలకంటే సాల్లేం గానీ, యీ రాత్రి కాడ ఆ జంగపోళ్ళు శివుఁడి పేరు జెప్పి గుండం దొక్కుతారు గదా, మన రామస్సోంవోరి పేరు జెప్పి మనం కూడా గుండం దొక్కకుంటే, మన పెండెం యిరిగిపోదా?”

నాంచా : “నువ్వేల తొక్కరాదూ?”

గురుజాడలు

539

మీ పేరిమిటి?