రత్నాం : వేళాకోళం మాని మొలనున్న కాసులు అక్కడ పెట్టు.
శెట్టి : యీ వాళకం సెట్టి దగ్గర పనికి రాదు. (లేచి నిలబడి రత్నాంగిని దూరానికి తోసి తలుపు వేపు జరుగును)
రత్నాం : దొంగ! దొంగ! మంజువాణీ (అని కేక వేసును.)
శెట్టి : నేనేం యెఱ్ఱి కుట్టి బాపనాణ్ణనుకున్నావా యేమిటి? నీ యిష్టం వొచ్చినవాళ్లని పిలువు.నాకు భయమనుకున్నావా? (పెద్ద గొంతుకతో) నన్ను యీ సీకటి గదిలోకి పిలిసి యీ బంగారం మనం పంచుకు దొబ్ళుదామంటే నే నొప్పుతానా? నీక్కావలిస్తే నువ్వు దొబ్బు. పోలీసోళ్ల పట్టుకున్నప్పుడు నువ్వడ్డుపడతావా? రామసాని దెయ్యమై పీక పిసికితే నీ డబ్బడ్డుపడతాదా? (తలుపు దగ్గిరకి దాసీలు, మంజువాణి, నరహరిరావు గారు వచ్చి తట్టుదురు)
శెట్టి : నా యెత్తు ధనం పోస్తే యిలాంటి దొంగ పని నేను చెయ్యను. యింత ద్రోహవాఁ? పాపము బద్దలై ఆకాశమంత పిడుగు నెత్తిమీద పడదా? నా చెయ్యి వొదిలెయి. తలుపు తీసి నీ భవిష్యం నలుగురి యెదుటా తీస్తాను.
రత్నాం : చేతులు పట్టు వొదల్దు ! ఏం చెయ్యను?
నరహరి: (తలుపు మీద చెయ్యివేసి) యెవర్లోపల?
రత్నాం : శెట్టి -
మంజు : శెట్టా? యెలా వొచ్చాడు?
శెట్టి : శెట్టి యెలా వచ్చాడా? రత్నం రమ్మని ప్రాణం తింటే వచ్చాను. బంగారం నాణెం చేసి ఖరీదు కట్టాలి రమ్మంటే వచ్చాను. దొంగ పని చెయ్యమంటే నే నొడబడతానా? రామసాని సొమ్ము ఒక్క చిల్లికాసు ముట్టుకుంటే పిశాచై పీక పిసగదా? (తలుపు తీసుకు పైకి పోవడాన్కి ప్రయత్నిస్తూండగా)
రత్నాం : పట్టుకోండి! మొల్లో కాసులు ముడుచుకుపోతున్నాడు? అవుగో, వుంగరాలతో పాటు...
శెట్టి : యేటీ మనిసి యికారం. (రత్నాంగి మీదికి వంగి మొహం దగ్గర మొహం పెట్టి) నే దొంగనా? నువ్వు దొంగవా? మా యింటావంటా ఆ మాటలేదు. ఆ మాట మళ్లీ అన్నావంటే చాలా దూరం యెళుతుంది. కోవఁటోళ్లం! మా యిల్లంతా బంగారం! మా వొళ్ళంతా బంగారం.
నరహరి: శెట్టీ!
గురుజాడలు
496
కొండుభొట్టీయము