సౌజన్య : అయితే ఆ పిల్ల ఆస్తికి మీమీద దావా తేవలసివుంటుంది.
అగ్నిహో : దావాలకి భయపడేవాణ్ణి కానండోయ్.
సౌజన్యా: అది నాకు తెలుసును, మీరు అగ్రహారపు చెయ్యి, ఆఖరుమాట ఒక మాట చెబుతాను, ఆలోచించండి. మీరు గిరీశంమీద కేసుతేవడం మానుకుని ఆ పిల్ల తాలూకు ఆస్తి యిచ్చివేస్తే, మీమీద లుబ్ధావధాన్లుగారు తెచ్చిన ఫిర్యాదు తీయించివేస్తాను.
అగ్నిహో :కేసు మానుకుంటానూ? లుబ్ధావధాన్లుకు చేసినట్టే యెప్పుడో వొహప్పుడు వాడిక్కూడా యెమికలు పచ్చడిచేస్తాను. లుబ్ధావధాన్లు నన్ను చేసేదేమిటి? సాక్ష్యం రావాలికాదూ.
సౌజన్య: ఇప్పుడు మీరే నాదగ్గిర వొప్పుకున్నారుగదా! నేనే పలుకుతాను సాక్ష్యం.
అగ్నిహో : అంతవారు కారనా, యేడిసినట్టేవుంది ముండాసంత, యేడిసినట్టేవుంది. యిందుకేనా యింత ప్రత్యుథ్థానంచేసి నన్ను తీసుకువచ్చారు. యేమిటో కేసులో సలహా చెబుతారనుకున్నాను.
(అని లేచి వెళ్ళిపోవును)
***
మూడవస్థలము - విశాఖపట్టణములోని వీధి
(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులు ప్రవేశీంచుచున్నారు)
1 వ శూద్రుడు : యక్కడనుంచి విజయం చేస్తున్నారు?
బైరాగి : నేను కాశీనుంచి వస్తున్నాను.
1 వ. శూద్రుడు : యన్నాళ్లాయి బయలుదేరినారు?
బైరాగి : రెండురోజులయినది.
2 వ. శూద్రుడు : యలాగొచ్చారు యింతయేగిరం.
బైరాగి : పవనం బంధించి వాయువేగంమీద వచ్చాము.
3వ శూద్రుడు : యోగులకి యాలాటి శిద్దులయినా వుంటాయి. యీయనే కాబోలురా మొన్న శివరాత్రికి, సింహాచలంలోను, వుపాకలోనూ కూడా ఒక్క మాటే కనపడ్డాడనీ అనుకున్నారూ?
బైరాగి : యీ వూరిలో సదావృత్తి మఠం వున్నదా?
3వ శూద్రుడు: లేదుగురూ మేమంతా వుండగా మీకు మఠం యెందుకూ? కాశీలో భోగట్టా యేమిటిగురూ!
గురుజాడలు
196
కన్యాశుల్కము - తొలికూర్పు