లుబ్ధావ: విశాఖపట్నం.
రామప్ప: (బుర్ర తటాయించుచు) కానీ చెపుతాను - లౌక్యులంతా నాలుగుఘడియల ప్రొద్దుకు వస్తారు గదా యేమిటి చెయ్యడం?
లుబ్ధావ: యేమీతోచకుండా వున్నది. తమరే చక్రం అడ్డువెయ్యాలి.
రామప్ప: కానియ్యి మేజువాణీ పెడదాము. మధురవాణికి రాత్రులకు కంట్రాక్టుగాని పగలు రావడముకు ప్రసక్తంలేదు. దానికి ఇందుకు వేరే ఇస్తేనేగాని కుదరదు.
లుబ్ధావ: మీరేమిమ్మంటే అదిచ్చుకుంటాను.
రామప్ప: యెవరోయి నౌఖరు, పోలిశెట్టిని పిలువు. యెవరోయి వంటబ్రాహ్మలు, ఫలహారాలు మా బసకి పంపించీనారా లేదా?
(తెర దించవలెను)
***
నాల్గవస్థలము - లుబ్ధావధాన్లుగారి యిల్లు
లుబ్ధావ: సోమన్నశాస్రుల్లుగారు వచ్చారయ్యా నా గుడ్లు పైకి వస్తూన్నాయి.
పురోహి: ఇదివరకు పదికబుర్లు వెళ్లాయి. ఇప్పుడే దేవతార్చన చేస్తున్నారు.
లుబ్ధావ: రామయ్యపంతులుగారు వచ్చారా?
బ్రాహ్మడు : ఇప్పుడే చుట్టకాల్చుకుని స్నానానికి వెళ్లారు.
లుబ్ధావ: పంతులూ, నాకు మా ఆకలి వేస్తూన్నదయా పెందరాళే మెతుకులు పడితేనే కానీ ప్రాణం నీలవడం కష్టం.
రామప్ప: మాయింటికిరండి అక్కడ చల్దివణ్ణం యెవరికీ తెలియకుండా పెట్టేస్తాను. ఇప్పుడు ఆచార మాలోచిస్తే కథ మొదటికి వస్తుంది - యేదో వొకటి పెందరాళేకానియ్యండి.
లుబ్ధావ: (నాలుగడుగులు నడచి తొంగిచూచి.) ఓయి నాయినా - ఇంతమందిని పిలిచినా వేమయ్యా భోజనానికి?
రామప్ప: ఇదో విశేషంటయ్యా - ఇందులో ముప్పాతిక మంది పిలవనివాళ్లే పీక బట్టుకు గెంటుతూ వుంటే పెణకపట్టుకు వేళ్లాడుతున్నారు. యీ సప్లై వూసు మీ కెందుకు మీరు ముందు భోజనానికి పదండి.
(వెళ్ళిపోవుతున్నారు.)
గురుజాడలు
171
కన్యాశుల్కము - తొలికూర్పు