స్వామిని దర్శించి ఐహికాముష్మిక ఫలితములను బొందుచుందురు. ఈ దేవాలయోత్సవములకు శ్రీ పీఠికాపుర మహారాజావా రొసంగిన భూములున్నవి. పెద్దాపురపు రాజుల పరిపాలనలో గూడ గొప్పకోట యుండెడిది. బొబ్బిలియుద్ధములో రంగరావు కుమారుని రహస్యముగా మల్లమ్మ దేవి పంపయత్నించిన దీకోటకే. మొన్న మొన్నటి వరకు బ్రిటిషుపటాలము లిచ్చటనే యుండెడివి. గోదావరి కాలువయును, యేలామహామునిచే దీసికొని రాబడిన యేలేరును యిచ్చటనే బ్రవహించుచున్నవి. మన మండలములో పంచదార చేయు ఫ్యాక్టరీ యును, వ్యవసాయపరిశోధకశాలయను నిచ్చటనే యున్నవి.
గ్రంథాలయోద్దేశ్యము
దీనిని బ్రతి గ్రామమునను స్థాపించి తన్మూలమున బ్రజలను జ్ఞానవంతులనుగా నొనర్చు సంకల్పమే గ్రంథాలయోద్యమము. జనుల నెల్లర జ్ఞానవంతులుగా నొనర్చుటయే దీని లక్ష్యము. తాను జ్ఞానవంతుడై పరులను జ్ఞానవంతుల జేయవలెనను స్వభావమే యీ యుద్యమ కారణము. మనుజుని జీవయాత్ర పవిత్రముగను బురుషార్థ సాధకముగను జేయుటయే ఈ యుద్యమ ప్రాప్యము.
పూర్వచరిత్ర - పరిణామము
చిరకాలము క్రిందట నార్యఋషులే గ్రంథాలయములుగా నుండిరి. అప్పుడు భాషకు లిపిలేనందున దండ్రులు పుత్రులకును, గురువులు శిష్యులకును సంతలజెప్పి వల్లింపజేయుచు సుమారారు వేల సంవత్సరముల కాలము విజ్ఞానమును గాపాడిరి. లిపి యేర్పడిన పిదప దాళపత్రములు, శిలలు, రేకులు, కొయ్యలు, మొదలగు వానిపై వ్రాయుచుండిరి, పదు నేనువందల సంవత్సరములనాటి తాళపత్రి గ్రంథములందు ఒక్కొక పత్రముపై పదునారు పంక్తులు గలిగి ముత్యములు బోలు నక్కరములు గాంచిన యెడల మన పూర్వుల గ్రంథాభిమానమును వారుపడిన శ్రమయు దెలియగలదు. మన దేశమునందు గ్రంథాభిమానము నవీనముకాదు. పాశ్చాత్యులు వస్త్రధారణ మననేమో యెరుగని కాలమున గూడ మన దేశము విజ్ఞానామృతమ్మను వెద