Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.9 (1929).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్న పిదప ఏమఱి చెట్టు క్రిందనో, ఏగ్రామచావడియందో, ఏరచ్చబండవద్దనో సమావేశమై ఇహపర సౌఖ్య సాధనములగు విషయములను గూర్చి ఇష్టాగోష్టులు జరుపు సమావేశములు నిట్టివియే. గ్రంథాలయ మన్న పురాతన కాలములందు కేవలము గంథ నిక్షేపములుగా నుండెను గాని ఇప్పటికాలపు సంస్థ లట్టివిగావు. ఈయుద్యమము ఈ కాలమునందు మన దేశములో బరోడా రాష్ట్ర మందు మిక్కిలి అభివృద్ధిని గాంచినది. కావున పైన చెప్పిన ప్రాచీన సంస్థలయం దిమిడియున్న సాంప్రదాయ సూత్రముల ననుసరించియు, అభివృద్ధిదాయకములగు ఆధునిక కార్యవిధానము నవలంబించియు ఈసంస్థను నడిపిన గాని తగినంత లాభము చేకూరదని మేము నిశ్చయించుకొంటిమి. అందుకు ఫలితముగ అప్పటికిని ఇప్పటికిని మాసంఘ కార్యదర్శిగారగు శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులుగారు బరోడానగరమునకు వెళ్ళి అచ్చట అఖండముగా జరుగు చున్న కేంద్ర గ్రంధాలయసంస్థ యొక్క కార్యములను విచక్షణతో అభ్యసించి వచ్చిరి. అందుకు ఫలితముగ మా సంస్థయందు కొన్నిటి అభివృద్ధిని ఇదివరకే చేయగల్గితీమి. అందు బాల శాఖ ముఖ్యమైనది. సంచార గ్రంథాలయ పేటికలను గూర్చి ప్రయత్నించుచున్నాము. అచ్చటచ్చట ప్రోత్సాహము వచ్చుచున్నది. అచిర కాలమున ఫలవంత మగునని నమ్ముచున్నాము.

మరియొక యంశము. గ్రంథవిస్తర భీతితో ఇంతటితో విరమించుచున్నాను. ఆదికాలము నుండియు దానము మన దేశమునందు పరమ ధర్మముగా పరిగణింపబడుచుండెను. ఈదానము మన దేశీయులలో చాలమంది దేవళములకును, సత్రములకును మాత్రమే వినియోగించుచు న్నారు. మన సాంప్రదాయ మట్టిదికాదు. “సప్తసంతానములను” ప్రతీతినిబట్టి ప్రజోపయోగకరమగు అన్ని కార్యములను గూర్చి దానముచేయుటయే పురాతన కాలము నుండియు ఇచ్చట జరుగుచున్నదని మనకు బోధపడుచున్నది.

మాసంఘ చరిత్రిలో దానమునకు పరమపాత్రతను గమనించుటయు, అందుకొరకు ఉదారమగు ఈవిని ఇచ్చుటయు సంసిద్ధినొందెను.