Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మగు వాఙ్మయమునుఁ బరిశీలింప నవకాశము కలుగజేసినందులకును ఈప్రాంతముల నెన్నండును జూడ నవకాశముకలుగని నాకీమిషచే నట్టిలాభము కలిగించినందులకును మీ కెంతయు కృతజ్ఞుండ నగుచున్నవాడను. సభాకార్యనిర్వహణము మీదయ ననుసరించి యున్నదిగాని సభాధ్యక్షుని ప్రయోజకత్వమునలేదు. రాతికి ప్రాణప్రతిష్టంజేసి యధిష్ఠాతంజేసిన నదియ పూజ్యంబగును. తద్భావము మారినప్పుడదియె బొమ్మరాయి యగును. త్రొక్కిన రాయి మ్రొక్కిన దైవముగదా! పలువురుమనస్సు లెచ్చట సేకీభవించి పనిసేయునో యచ్చట మున్నులేని శక్తికూడ నావేశము కాగలదు. జ్ఞానప్రదాతలగు మీ భావనాబలంబున నాశక్తి సామర్ధ్యంబు లత్యల్పంబులయ్యును కార్యసాధనోత్సాహ మత్యంతమగుచున్నది.

జ్ఞానము

దైవదత్తము దానికి సాంగత్యవిశేషమున నుద్బోధముకలుగును, తోడివారలతమయంతవారిగా, ఒక్కొకపుడు, తనుకంటె నెక్కువవారిగగూడజేయుచుండును. ఈ జ్ఞాన మొకనాటిది కాదు. ఒక చోటిది కాదు. దాని కాది లేదు అంతము లేదు. ఆద్యంత శూన్యంబగు నీజ్ఞానాంబుధినుండి ధీవిశాలురు తమబుద్ధి వైశాల్యము కొలంది ప్రజ్ఞాబుద్ధులసంగ్రహించి వానిని క్రమక్రమముగా విజృంభింపజేయుదురు. అయ్యది తోడివారలకు వాగ్రూపముననో లిఖితరూపకముననో లభింపజేయుచుందురు. వాగ్రూపక మైనయెడల నక్షరాస్యునకును నిరక్షరకుక్షికినికూడ నుపయోగపడును. లిఖితరూప మొక్కయరజ్జునకే విదితమగును. కాని వా గ్రూపక మాయొక్క యుపాధితోడ నే అంతరింపగలదు. లిఖితరూపకము యుగములకొలది నిలచియుండును. గ్రంధములన నివియెకదా! వాగ్రూపకము గూడ స్వరయంత్ర మూలమునను, 'సంజ్ఞా లేఖన మూలమునను చిరస్థాయగ నిలువ నాధారము లేర్పడినవి.

కించిజ్ఞుండును, మితాయుష్మంతుండునునగు మానవునకు నాడు లభించిన జ్ఞానము నాటితోడనే యంతరంచి చిరస్థాయిగ నిలువకుండినయెడ నీ జన్మ బంధవిమోచనకు మార్గమే లేక యుండియుండును. యుగయుగముల లభియించిన జ్ఞానము నిల్చియుండుట చేతనే యైహికాముష్మిక సౌఖ్యంబులు రెండునుఁ గూడ నొక నాటికన్న నొకనాడెక్కువ లభించుట కవకాశము గలుగుచున్నది. ఆదిలేకున్న గాలికివిడచిన హారతికర్పూరమువలె యెప్పటిజ్ఞాననుప్పుడు శ్రేణ్యమునంది మరల యధాస్థితికి రావలసివచ్చుచుండును. శబ్దరూపమును వర్ణరూపకముగ మార్పగలిగిన యావ్యక్తిమహిమ మెట్టిదియోగాని ఆమహావ్యక్తి జగత్తంతకును మోక్షసాధనకుయినది. లిపియే లేకుండిన మనకు వ్యాసుడులేడు. వాల్మీకి లేడు. కాళిదాను లేడు. తిక్కన లేడు. నన్నయలేడు. షేక్స్పియర్ లేడు. వారివారి గ్రంధములు లేవు. గ్రంథాలయము లేవు. జ్ఞానము గ్రంధస్థముగావించు టది తన కొక్కని కొరకే కాక యన్యునకు కూడ నుపయోగపడవలెనను నుద్దేశముతోడగదా. అది యెంత విపులముగ నుపయోగపడిన దానికంత చరితార్ధత. గ్రంథస్థమయిన జ్ఞానమునకూడ తమతమ భేదమున్నది. ఏది యెట్టివారి కుపయోగపడవలెనో అది యట్టివారికి లభింప జేయవలెను. వ్యత్యస్తమయిన యెడల వ్యర్థకాలక్షేపమగును. ఈపనులకొరకే గ్రంథాలయము లేర్పడినవి. గ్రంథాలయములవలన ముక్తియు, భుక్తియుగూడ నున్నవి. మన దేశము ముక్తివిద్యకు మూలస్థానమని సర్వమతములవాకును ఒప్పుకొనియే యున్నారు. దానినిగూర్చిన జ్ఞాన వ్యాపనముమాట యటుంచి ముందుగ భుక్తికనుఁగు జ్ఞానమును వ్యాపింపజేయు మార్గమును గూర్చి యాలోచింతము. తిష్ఠ కుదిరిన గాని నిష్ఠ కుదురదు. మనకు భుక్తి బాగుగ నుండవలెననిన మనదేశము బాగుండవలెను. మనయుపాధులు బాగుండవలెను. వివేకి యగువానికెల్ల దేశమునకై పాటుపడుటయు దేశాభ్యుదయమును లక్ష్యమునందుంచు కొనుటయు, విధ్యుక్తము. 'స్వయంతీర్ణః పరాంస్తారయతి' దేశాభ్యుదయమునకు.

దేశభాషల యభివృద్ధి

ముఖ్యసాధనము. దేశభాషయందు జ్ఞానము వెల్లిరిసిన గాని కాలాకాలవివక్షత లేకుండ అక్షరాస్య నిరక్ష్నిరాస్యభేదము లేకుండ జ్ఞానము దేశమున వ్యాపింపదు. మన