సామాన్యముగా లోకములో స్త్రీలకుఁ బండ్రెండవసంవత్సరము మొదలుకొని యౌవన మంకురించును. సీతకు నట్లే యౌవన మకురించె నని చెప్పుటచే నామెకుఁ బండ్రెండుసంవత్సరముల వయస్సని మన మూహించుకొనవచ్చును. రాముఁడుగూడ నంతవయస్సు గలవాఁ డగుటచే "తేజసాం హి న వయ స్సమీక్ష్యతే" అన్నట్టు లతఁ డప్రాకృతదివ్యమూర్తి యగుటవలనఁ బండ్రెండేండ్లకుముందే ప్రాప్తయౌవనుఁ డగుటచే సీతారాములవివాహవిషయమయి విరోధము లేదు. సీతారాము లుభయులు వివాహమునాఁటికిఁ బండ్రెండేండ్లవయస్సు గలవా రైయుండి రని యొప్పుకొనినచో నరణ్యకాండములో సీత సన్న్యాసివేషధారి యై తనకడకు వచ్చిన రావణునితోఁ జెప్పినమాటకు విరోధింపదు.
| | "ఉషిత్వా ద్వాదశసమా ఇక్ష్వాకూణాం నివేశనే, | (ఆరణ్య.) |
వివాహకాలమునకుఁ బండ్రెండేండ్లవయస్సు గలసీత వివాహానంతర మత్తవారియింట సకలభోగముల ననుభవించుచు మఱిపండ్రెండేండ్లు కాపురము చేసి యరణ్యమునకుఁ బోయినపుఁ డామె కిరువదినాలుగేండ్లవయ స్సని చెప్పుట సోపపత్తికముగాని పదునెనిమిదేండ్లవయ స్సనిచెప్పుట యసంగతముకదా! యన్నచోఁ గానేరదు. జనకరాజుయొక్క యజనశాలాభూమిలో దొరకిన స్వర్ణపేటికఁ దెఱచి యేముహూర్తమందు సీతాముఖకమలసందర్శనం బొనర్చెనో యాక్షణమే సీతాజననకాల మనునభిప్రాయముతో గణించినయెడల సీతకుఁ బదునెనిమిదివత్సరములవయ స్సని చెప్పుట యుపపన్నమే. ఇచటఁ దత్త్వ మిది.
పూర్వకాలమందు లంకలో నుండెడు నొకతామరకొలనులోఁ దామరమొగ్గయందు వేదవతి యను నొకకన్యక యుద్భవించెను. శివపూజార్థ మయి పద్మములం గోయఁ బోయిన రావణుఁ డామెను జూచి ప్రహస్తాదిమంత్రివర్గముతో నాలోచించి యీమె మనలంకలో నున్నయెడల మన కందఱకుఁ గీడు మూడు నని నిశ్చయించి బంగారుపెట్టెలోఁ బెట్టి సముద్రములోఁ బడవైచెను. అంతట నాపెట్టె ప్రవాహవేగముచే మిథిలానగరసమీపమునకుఁ గొట్టివేయఁబడి యచట భూమిలోఁ బాతివేయఁబడియుండెను అపుడు జనకరాజు యజ్ఞము చేయుటకయి యొకసాల నిర్మింపఁబోవువాఁ డై మొదట భూమిని సమముగాఁ జేయించుటకు నాఁగలితో దున్నించుచుండఁగా నాఁగలికిఁ దగులుకొని భూమిలో నుండి పై కుబికినపెట్టెను దీయించి తెఱచి చూడఁగా నం దొకకన్యక గాన్పించెను. అపు డామెకు సీత యనుపే రిడి పుత్త్రికాభిమానముచే నాఱుసంవత్సరములు బోషించి రాముని కిచ్చి వివాహము