Ixii
పీఠిక
యుద్ధసిద్ధి చంచలముగదా సీత నిపుడు నేఁ బలుకరించిన నింతయనర్థము సంభవిల్లును.
| | "భూతా శ్చార్థా విపద్యంతే దేశకాలవిరోధితాః | |
(సుందర. 30-37-39.)
"భూతార్థంబు లవివేకి యయినదూతకతంబున దేశకాలవిరోధితంబు లయి సూర్యోదయంబునందుఁ దమంబు నశించునట్లు నశించు. కార్యాకార్యవిషయంబు నందు సునిశ్చిత యయ్యును విక్లబుం డగుదూతకతంబున బుద్ధి శోభిల్లదు. పండితమాను లగుదూతలు కార్యంబులఁ జెఱుపరు. ఎవ్వండు బహుప్రకారంబులఁ గార్యంబుతెఱంగు విచారించు నతం డర్థసాధనంబునందు సమర్థుం డగుఁ గావున నిప్పుడు కార్యంబు నశింపకుండ నాకు వైక్లబ్యంబు గలుగకుండ సముద్రలంఘనంబు వ్యర్థంబు గాకుండ సీతారామలక్ష్మణులకు హాని గలుగకుండ నెవ్విధంబునఁ గార్యంబు నడుపుదునో" యని కొండొకసేపు విచారించి బుద్ధిమంతుం డగుహనుమంతుం డెట్టకేలకు రాక్షసస్త్రీలు వినకుండ నక్లిష్టకర్ముం డగు రాముని మెల్లనఁ బ్రశంసించె.
ఈరీతిగా నితనిబుద్ధి, కార్యకరణపాటవము, జితేంద్రియత్వము, సాహసనిర్భీకత్వములు, ధైర్యము, పరాక్రమము, దుర్ఘటకార్యసాధకత్వము, మొదలగు సద్గుణములు శ్రీరామాయణమం దెల్లెడలఁ గానవచ్చుచున్నవి. ఇతనివివేకము, దూరదృష్టి, పరాభ్యుదయసహిష్ణుత మొదలగునవి విభీషణశరణాగతిలో విభీషణునివిషయమయి యీతఁడు రామునితోఁ జెప్పినమంచిమాటలలోఁ బ్రతిఫలించుచున్నవి.
—————
కవిప్రశంస
ఇట్టి మహనీయ మగునీవాల్మీకిరామాయణము సంస్కృతభాషలో వ్రాయఁబడియుండుటచే దానియర్ధ మంతయు సంస్కృతభాష నెఱుంగనివారికిఁ దెలియదని యెంచి భక్తాగ్రగణ్యుఁడు మహాకవియు నగు గోపీనాథము వేంకటకవియను నాతఁడు మూలము ననుసరించి చక్కఁగా నాంధ్రీకరించెను. ఇదివఱకే కొంతకాలము క్రిందట కేవల రామాయణకథాప్రతిపాదకము లగు భాస్కరరామాయణము రంగనాథరామాయణము మొదలగునవి తెలుఁగున వ్రాయఁబడియున్నవి గాని యవి యా గోపీనాథము వేంకటకవి యాంధ్రీకరించిన రామాయణమువంటివి కావు. ఇది మూలము ననుసరించి వ్రాయఁబడినది. మూలమున కన్యూనాతిరిక్తముగాఁ దెలుఁగు వ్రాసెద నని ప్రతిజ్ఞ చేసి కవి యట్లనే యామూలాగ్రముగా గ్రంథమునంతయు నిర్వహించెను. ఈతఁడు వైదికబ్రాహ్మణుఁడు. నెల్లూరిమండలమం దున్న కావలి