పుట:Gopinatha-Ramayanamu1.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

గోపీనాథ రామాయణము


శా.

వ్యాప్తి న్రామకథాసుధార్ణవము నిత్యంబు న్దమిం గ్రోలియుం
దృప్తిం జెందనిపుణ్యు నాదిమకవిన్ దివ్యప్రభావాఢ్యునిన్
సప్తార్చిఃప్రతిమానపింగళజటాసందోహు నుద్యత్తప
స్తప్తుం గొల్చెద నిష్టసిద్ధికి మరుత్సంపూజ్యుఁ బ్రాచేతసున్.

35


క.

అని యమ్మునిఁ బ్రార్థించినఁ, బనిగొని ముద మలర నాకుఁ బ్రత్యక్షంబై
తన కజుఁ డొసఁగిన తెల్విని, ఘనముగ నాకొసఁగి చనియెఁ గారుణ్యమునన్.

36


వ.

ఇ ట్లమ్మహాముని యంతర్ధానంబు సేసిన నేను బహుజన్మకృతసుకృతపరిపాకం
బున నిమ్మహాకావ్యరాజంబు దొరకొనియెఁ గదా యని సంతసిల్లి రామాయణ
కథాప్రపంచవిరచనాదక్షుండనై యాభిముఖ్యంబు నొందితి.

37


ఉ.

ము న్నలభాస్కరాదికవిముఖ్యులు ప్రీతి రచించి రీకథం
జెన్నుగ నీవు గ్రమ్మఱ రచించుట కెయ్యది హేతు వంచు మీ
రన్న బుధేంద్రులార వినుఁ డారఘునాథచరిత్ర మెంద ఱె
ట్లెన్నిన నన్నిరూపుల కహీనగతిన్ దగి యుండు నుర్వరన్.

38


వ.

అదియునుంగాక తిక్కనసోమయాజి హరిహరనాథునిం గృతినాథునిం జేసి
భారతంబు సాంగోపాంగంబుగా రచించెఁ బోతనామాత్యుండు సీతాపతిం గృతి
పతింజేసి భాగవతంబు రచించెఁ గంకంటిపాపరాజప్రధానుండు రుక్మిణీశ్వరుం
గృతీశ్వరుం జేసి యుత్తరరామాయణంబు రచించె నాదికావ్యంబును మహా
మునిప్రణీతంబును షట్కాండకథాప్రపంచసంచితం బైన యీపూర్వరామా
యణంబు భాస్కరాదు లొక్కమర్త్యునిం గృతినాథునిం జేసి రచించి రిది
సమాచీనంబు గా దిమ్మహాకావ్యంబునకు రమానాథుండె కృతినాథుం డైనఁ
బదియాఱువన్నెబంగారునకు మాణిక్యంబుతోడి సంపర్కంబు గలిగిన చందం
బున నధికోదయంబై యుండుఁ గదా యని తలంచి యీరామాయణకావ్యం
బు తొలుతం గుశలవులవలన రామరూపధరుండైననారాయణుండె వినియెఁ
గావున నేనును దత్క్రమంబున శ్రీకృష్ణరూపధరుం డైన రమావల్లభునిం
గృతినాథునిం జేసి యీపుణ్యకావ్యంబు రచింప నిశ్చయించితి నీరామాయణ
రహస్యార్థతత్త్వంబు దెలియుటకు వామలూరుతనయుం డొక్కండు దక్క
నన్యు లెవ్వరును సమర్థులు గారైనను నాయెఱింగినంతఁ దేటపఱచెద నత్యా
దరంబున నంగీకరింపవలయు నింక మదీయవంశావతారం బభివర్ణించెద.

39

గ్రంథకర్తృ వంశావతార వర్ణనము

చ.

జలజభవాన్వయాటవివసంతుఁడు పావనగోపినాథస
త్కులకలశాభికైరవహితుండు కళాఢ్యుఁడు లోకబాంధవుం
డలఘుపదార్థకర్త చతురాస్యుఁడు కామహరుండు నిమ్మహీ
స్థలి సుమనోవిభూతిఁ దగు సాధుఁడు వేంకటశాస్త్రి ధీరుఁడై.

40