పుట:Gopinatha-Ramayanamu1.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు
శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః

గోపీనాథ రామాయణము

పీఠిక

శ్రీమీఱ న్వనజాననాదికులు ప్రార్థింపన్ ఖలశ్రేణి సం
గ్రామక్షోణి జయించి సాధుజనులన్ రక్షించి భూభారము
ద్దామప్రీతి హరించి ధర్మమును సంస్థాపింపఁ గృష్ణాకృతిన్
భూమానందముతో జనించినకృపాపూర్ణున్ హరిం గొల్చెదన్.

1


చ.

కలశపయోధిపుత్రి యలకాంచనగర్భునిఁగన్నతల్లి క
ల్వలదొరతోడఁబుట్టు హరివల్లభ లేములఁబాపులేమ సొం
పలరఁగఁ బద్మషండములయందు వసించెడుతన్వి లచ్చి నా
కెలమి సమస్తసంపదల నిచ్చి కృతార్థునిఁ జేయుఁ గావుతన్.

2


సీ.

కరటిచర్మముఁ దాను గట్టి భక్తులకు సువర్ణచేలంబు లెవ్వాఁ డొసంగె
ఫణిహారములు దాను బైఁదాల్చి యెవ్వాఁడు మణిహారములు దాసగణమున కిడెఁ
గాలకూటముఁ దాను గబళించి సేవకతతుల కెవ్వాఁ డమృతం బొసంగెఁ
దాను గపాలంబు ధరియించి యెవ్వాఁడు మితిలేని భాగ్య మాశ్రితుల కిచ్చె


తే.

నట్టి పరమదయాశాలి నబ్జమాళి, నఖిలలోకేశు భూతేశు నభ్రకేశుఁ
బ్రమథగణనాథు వినతసుపర్వనాథుఁ, బార్వతీనాథు మదిలోనఁ బ్రస్తుతింతు.

3


మ.

పతిసామేన వసించి భారతియు లోపాముద్రయున్ లక్ష్మియున్
సతతంబున్ భజియింప భూరికరుణాచంచత్కటాక్షంబులన్
బతికన్న న్నతకోటి కెక్కుడుగ సంపద్బోగసౌభాగ్యముల్
చతురత్వంబున నిచ్చుగౌరి నను వాత్సల్యంబునన్ బ్రోవుతన్.

4