పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

గోన గన్నా రెడ్డి

డంవల్లనూ, మనుష్యలోకంఅంటే అసహ్యంకలిగి అలా అయినాడని అనిపించింది.

రేపటిదినం ఆమెకు ప్రధానమహోత్సవం చేస్తారట. ఇదివరకు అతి తొందరగా వివాహం కావాలని ప్రధానమహోత్సవం జరపకుండా, వివాహానికి తరలి వచ్చారు పెళ్ళివారు. ఈపట్టున అన్నీ సక్రమంగా జరుపుతారట. అప్పుడు చక్రవర్తి అన్న భయము ఉన్నదట. ఇప్పుడు లేదట! ఇప్పుడు లకుమయారెడ్డే చక్రవర్తి అయినాడట! అందుకనే శుభముహూర్తపత్ర సమర్పణ తంతు ఇంత విచిత్రంగా జరుగుచున్నది.

ఎందు కీ గజదొంగ రూపము తన స్మృతిపథాలనుండి వీడదు? మొదటి చూపులోనే ఆతడు తనహృదయాన్ని గంటుచేసి, ఆ దారివెంట ఎవ్వరూ చొర రాని తన ఏకాంత భావహర్మ్యము చేరినాడు. గజదొంగలు కన్నమువేయరుకదా! ఆనాడు తాను తెర ఒత్తిగించి ఆ గజదొంగను చూచుటే దోషమైనదా? ఆనాటి నుండి ఒక్కక్షణమైనా ఈ తన చిన్నతనపు జీవితానికి శాంతి దూరమైనది.

పదునెనిమిది సంవత్సరాల అరవిచ్చు మల్లెపూప్రాయపు మసృణకోమల గాత్ర, ఆ బాలిక యౌవనక్షేత్ర ప్రథమగోపుర వినిర్గత సుందరి.

బంగారపువర్ణం ఆంధ్రయువకులకు కోరికలపంట. అందులో ఆమె తనుచ్ఛాయ మేలిమియే.

ఆ బంగారునకు కుసుమమసృణత్వము ఆంధ్రబాలికల స్వత్వము. ఆ మేలిమి బంగారు పూవుల లాలిత్యానికి గంధరాజ పరిమళము. ఆంధ్రయువతీ సౌందర్య సాధారణగుణము. హిమవన్నగసానువికసితదివ్యపుష్పసౌరభమై, సేవచేసే చెలులకే మైమరపు కలుగచేస్తుంది అన్నాంబికాకుమారి సౌందర్యము.

కోలమోములో, సోగకన్నులలో వాలుచూపులు, చిన్ననోరు, బంగారు సంపెంగ నాసిక సరియైన శ్రుతిలో కూర్చబడిన ఆ బాలిక మోమును ఆదవోని రాజసభాలంకారుడైన వృద్ధకవి త్రిపురాంతకేశ్వరమంత్రి ఈలా వర్ణించాడు :

“ఆ నవమోహనాంగి దరహాస వికస్వరలోచనద్వయా
 నూనత జూచియేమొ యతనుధ్వజమందలి మీన మట్టులే
 నాన వహించె, శ్రీకర వినమ్రము పద్మము వాడిపోయె, ఏ
 లో ననలెల్ల రాలెను, విలుంఛితమై యది వాలిపోవగన్.”

ఈ పద్య మా మహాకవి నిండుసభలో తండ్రియొడి నలంకరించిన ఎనిమిదేండ్ల బాలికయైన అన్నాంబికపై ఆశువుగా గానంచేశాడు. ఈపద్యం సర్వాంధ్ర మండలాలా ప్రతియువకునిచే పాడబడి ప్రసిద్ధమైన చాటువై పోయెను.

ఆమె కన్నుల అందాన్ని ప్రతికవీ వర్ణించాడు. నీలోత్పలపు అందం నీచోపమ మైన దా కన్నులకు?