చతుర్థగాథ
అన్నాంబిక
1
ఆయ నెంత ఠీవిగా ఉన్నారు! అవును. పూజ్యులైన గోన బుద్ధారెడ్డి సాహిణి మహారాజ పుత్రుడైన పురుషునకు మహారాజఠీవి రాకుండా ఏలా ఉండ గలదు?
అన్నాంబిక అంతుదొరకని ఆలోచనలతో తన అంతఃపురంలో సంగీత మందిరంలో దిండ్లు అలంకరించిన ఒక రత్నకంబళిపై, మెత్తని పట్టుదిండుపై ఒరిగి కూర్చుండియున్నది. ఆ మందిరమునిండా అనేక వాద్యవిశేషాలు వివిధ పేటికలలో ఉన్నవి. ఆమె ప్రక్కనే వల్ల కి ఒకటి మంజులాంగుళీస్పర్శ నాకాంక్షించి ఉన్నది. ఆ మందిరమంతా రత్నకంబళ్ళు పరచి ఉన్నవి. వానిపై పట్టుదిండ్లు అక్కడ అక్కడ ఉంచబడినవి.
అన్నాంబిక పద్మాసనం వేసుకొని కూర్చుంది వీణామతల్లిని ఒడిలోనికి తీసికొని,
“లోక భీకరులైన దొంగల
మూకలను పాలించు అలక
న్నాకు చరితము వల్ల కీ! పలు
పోకలను పాడేవు తగునటె వల్ల కీ !”
అని ఒక పాట ఆలపించినది.
ఆమెకు కంట నీరు తిరిగిపోయినది. వసంతకాలంలో తొలకరి చినుకులు హృదయమందు దాచుకున్న చిన్న మేఘాలులా ఆమె కన్నుల నీరుకమ్ముకుంది.
“కొండరాళ్ళో, దండకాటవో
ముండ్లదారులో, మండుఇసుకో
నిండెనేమో హృదయమందున
దండువెడలే దొంగటే?”
అన్నాంబిక సౌందర్యం ఆంధ్రలోకంలో వింతగా చెప్పుకుంటారు. అన్నాంబిక విద్య, అన్నాంబిక శేముషీసంపన్నత ధూపకరండమునుండి దెసలన్నీ కమ్మే పరిమళంలా దేశాలన్నీ ప్రసరించింది.
మహారాష్ట్ర యాదవుడు, చోళ పాండ్యదేశ దాక్షిణాత్యప్రభువులు, కదంబ గాంగులు, కుంతల చాళుక్యుడు అన్నాంబికను వాంఛించారు.