పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

గోన గన్నా రెడ్డి

తున్నారు. ముమ్మడాంబికా వివాహముహూర్తమూ, ఆ ముహూర్తం దగ్గరనే ఏర్పాటవుతవి” అని తెలియజేసిరి.

ఈ వార్త వినగానే సభలో విజయధ్వానాలు మిన్నుముట్టినవి.

ఆ సామ్రాజ్యాభిషేకమహోత్సవ సందర్భంలో రుద్రదేవి స్వయంవర మహోత్సవము జరుగుతుందని శివదేవయ్య దేశికులు అనుకొనలేదు. చాళుక్య వీరభద్రమహారాజుకూడ ఆ సమయంలో ఆలాంటి సంఘటన సంభవిస్తుందని తలచిఉండలేదు.

రుద్రదేవి మాటలు ఆయనవీనులకు శారదవీణానిస్వనములై వినిపించాయి. అమృతప్రవాహాలు తనపై విరుచుకుపడినట్టయినది. ఆయన మ్రాన్పడి నిలుచుండిపోయినాడు. ఆయన కన్నులు తళతళలాడిపోయినవి. ఆయన మోము ద్వాదశార్కులవలె వెలిగిపోయినది. ఆయన ఆ దేవి కన్నులలో పవిత్రనృత్యం చేసే ప్రేమ కాంతులూ, ఆ సుందరాంగి పెదవులలో సురభిళమయ్యే ప్రణయ మాధుర్యాలూ గమనించి, లోకలోకా లావరించిపోయినట్లు, అమృతకలశము చేతుల కందినట్లు పులకరించి, తల వంచినాడు.

రుద్రదేవి, ఆయన మెడలో చెలికత్తె లందిచ్చిన పూలహారము వేసింది.

బంగారు కవచము ధరించి రత్నస్థగిత కిరీట కేయూర కుండలాది సార్వభౌమలాంఛనాలతో, దివ్యపురుషునిలా ఎదుట వెలుగు మూర్తి మాయమై, చాళుక్య వీరభద్రమహారాజు మనోనేత్రాలకు ఆనాడు క్రీడోద్యాన వనాన చివురుటాకులప్రోవై, కరడుకట్టిన అమృతధారయై, ప్రోగుపడిన వెన్నెలకిరణాలై తోచిన దివ్యసుందరరూపం తిరిగి ప్రత్యక్షమైనది.

ఆ దండవేసే రుద్రమహారాణీ కరస్పర్శచే, ఆయన పరవశుడై సర్వమూ మరచిపోయినాడు.

వివాహములోపల చాళుక్య వీరభద్రుడు రాచకార్యాలు మాట్లాడడానికి చక్రవర్తి అంతఃపురానికి వెళ్ళవలసి వచ్చెడిది. అక్కడ చెలికత్తెలు పరివేష్టించి ఉండగా రుద్రమ ఆయనకు దర్శనమిచ్చేది. ఇద్దరూ రాజ్య వ్యవహారములు ఎన్నో సమాలోచన చేసేవారు. చెలికత్తెలు ఏదేని పనిమీద ఇక్కడకూ అక్కడకూ వెళ్ళిపోయేవారు. ఆ సుందరమందిరంలో వారిద్దరే ఉండేవారు. ఆ విషయం కొంతసేపటివరకూ వారిద్దరికీ తెలిసేదికాదు.

ఆ విషయం గుర్తించగానే ఇద్దరూ చటుక్కున మౌనం వహించేవారు.

ఒకరి నొకరు చూచి నవ్వుకొనేవారు.

ఆయన సంశయము నామె గ్రహించి,

“ప్రభూ! రండి. నా గానమందిరానికి పోదాము” అని ఆహ్వానించేది.

రుద్రదేవి గానమందిరంలో చాళుక్య వీరభద్రుడు దంతపీఠాలపై ఉన్న వివిధదేశ విపంచులు చూచినాడు.