పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

గోన గన్నా రెడ్డి

చాళుక్య వీరభద్రమహారాజు తన వైపు చూస్తేచాలు! తాను చక్రవర్తి అన్నమాట మరచిపోతున్నది.

వెంటనే పర్యంకమునుండి దిగ్గనురికి రుద్రదేవి ప్రక్కనున్న జేగంట వాయించినది. వెంటనే ఆ దివ్యమందిరం బైటనుండి పలువురు దాసదాసీలు పరుగెత్తుకొని వచ్చినారు.

“సిద్ధం చేయండి, త్వరపడండి.”

సామ్రాట్టు వాక్కులు విని ఆ పరిచారికలు పదిలిప్తలలో మహారాణిని విష్ణుని కైసేసినట్ల అలంకరించారు.

“ముమ్మడాంబికను అలంకరించి తీసుకొనిరండి” అని చక్రవర్తి ఆజ్ఞాపించినారు.

సభలో అపరోధ స్థలంలో అన్నాంబికాది యువతులతో హాస్యపు మాటలు చెప్పుకుంటూ, నవ్వుకుంటూఉన్న ముమ్మడాంబిక చక్రవర్తి ఆజ్ఞ విని గుండె దడదడలాడ చెలికత్తెలవెంట అంతిపురికి పోయినది. అందు చెలికత్తె లామెను రతీదేవివలె అలంకరించారు.

అంతవరకు తమ అభ్యంతర సభామందిరంలోనే చక్రవర్తి కూరుచుండెను.

ముమ్మడాంబిక అలంకృతయై దగ్గరకు రాగానే రుద్రదేవి చిరునవ్వుతో “ముమ్మడాంబికరాణీ! నేను నిన్ను మూడేమాట లడుగుతాను. వానికి ‘ఏమీ సందేహించకుండా ప్రత్యుత్తరం చెప్పు’ అని అడిగింది. తెల్లబోతూ ‘అల్లాగే’ నని ముమ్మక్క జవాబు చెప్పినది.

రుద్రదేవి ముమ్మక్కచెవిలో గుసగుసలాడింది. ముమ్మక్క తెల్లబోతూ సిగ్గు పడుతూ అవునంటూ తలఊచింది.

రుద్రదేవి ఆనందంతో నవ్వి ముమ్మక్క చేయి పట్టుకొని చెలులు, మంత్రులు, అంగరక్షకులు దారిచూపిస్తూ ఉండగా మంగళవాద్యాలు ముందు మ్రోగుతుండగా దయచేసి, సభికులందరూలేచి జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా సింహాసనం ఠీవిగాఎక్కి ముమ్మక్కను ప్రక్కన కూర్చుండబెట్టుకొన్నది.

చక్రవర్తి, అందరూ ఆశీనులయిన వెనుక, శివదేవయ్య దేశికులతో “గురుదేవా! ఈ నిండుసభలో మేము ఒక విషయము మహారాజులకు, సామంతులకు తెలియచేయ దలచుకొన్నాము” అనిరి. శివదేవయ్య దేశికులు ముఖ్య వందికి సైగచేసిరి.

ఆ వంది వెంటనే తన శంఖమెత్తి సింహాసనం మ్రోలనుండి భోం భోం! అని ఊదినాడు. సభ నిశ్శబ్దమైనది. నాట్య మాగినది.

రుద్రచక్రవర్తి ముమ్మక్క సహాయంతో సింహాసనం దిగింది.