పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్ర

23

రాజకుమారులకు పంపించవలసిన మహారాజభూతాదికర్చులు పంపించడం మానివేశాడు.

వర్ధమానపురంలో స్వామినివేదనలు, అర్చనలు గన్నభూపతిపేర చదివించడం మానివేశారు. సంవత్సరాదినాడు హజారంలో వైతాళికులు, వందులు శ్రీశ్రీ గన్నభూపతి మహారాజా! అని పాడుటమాని, శ్రీ లకుమయ మహామండలేశ్వరులపేరు పాడుతున్నారు. లకుమయ శిలాతామ్రశాసనాలల్లో గన్నారెడ్డిపేరు లిఖించడం మానిపించాడు.

మహారాజ తంత్రజ్ఞులైన శివదేవయ్యమంత్రులు, మహాసేనాని జన్నిగదేవులు, రాజభక్తిపూరితచరిత్రుడు ప్రసాదాదిత్య నాయకులున్ను సామంతమండలేశ్వరులు తిరగబడకుండా ఆంధ్ర మహాసామ్రాజ్యం జాగ్రత్తగా కాపాడుకోవడంలో మునిగి ఉన్నారు. వాండ్లకు గన్నారెడ్డికి ఆలోచన చెప్పడానికి తీరిక లేదాయెను.

లకుమయ బలవంతుడు, చాలా ధనం కలవాడు. అతనివైపువాండ్లు చక్రవర్తి ఆస్థానంలో ఉండనే ఉండిరాయను. వాండ్లుపోయి వృద్ధచక్రవర్తి చెవిలో లకుమయా రెడ్డి రాజభక్తి వేనోళ్ళవర్ణిస్తూఉండిరి.

అప్పు డాలోచిస్తూ “అవునయ్యా ! ఈ విషయాలు యావత్తూ శ్రీ శివదేవయ్య దేశికులకు విన్నవించండి. గోన గన్నయ్య చాలా మంచివాడు అనుకొంటిమి. వీర విద్యలయందూ, సర్వశాస్త్రాలయందూ అతడు పండితుడవుతూ ఉండెను. మాయందూ, యువరాజులవారియందూ ఎంతో భక్తిగా ఉండెను. మీరు పలికే పలుకులు విరుద్ధంగా ఉంటున్నవేమి?” అని శ్రీ గణపతిరుద్రదేవులు అన్నారు.

“మహారాజాధిరాజా ! అదే గన్నయ్యలో ఉన్న విచిత్రము ! అయనా, విఠలనాథుడూ, అనేకులు బాలకులు ఓరుగల్లుపురంలో చేసే అల్లరి మహాప్రభువులతో విన్నవించేది ఎవరు?”

“సరేనయ్యా. మా కీ గొడవలు పట్టవు. చిన్న మహారాజులుంగారితో మనవిచేసుకోండి” అని గణపతిదేవులు లకుమయపక్షంవారిని పంపివేశారు.

వారు తిన్నగా లకుమయారెడ్డికి రహస్యచారునితో ఈలా లేఖ పంపించారు.

5

"శ్రీ శ్రీ ఓం నమఃశివాయ
 తేయాద్దేవో ద్విరవదనః శర్మినః శైశ వేయః
 పాయంపాయం కరవిరళతశ్చాపలాచ్ఛూత్కృతేన
 అస్తేస్తన్య ప్రచుర వృషతై ర్బూషయత్యంబికాయాః
 స్రైర్మూర్ధన్ న్యైరివకుచయుగం మౌక్తికైర్ముక్తదోషః.