పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయధ్యానం

291

తూర్పుద్వారానికి సూటిగా యాదవ మహాదేవరాజు సైన్యాలను చీల్చుకుంటూ, పద్మవ్యూహము చొచ్చివచ్చే అర్జునునిలా చొచ్చి రాసాగెను.

అ సమయంలోనే ఉభయ మల్యాల మహారాజుల సేనలు దక్షిణపుద్వారానికి ఎదురుగా మహాదేవరాజు మూకలను చీల్చుచు కాటచమూపతి, గుండయ ప్రభువుల ఉభయ నాయకత్వాన చొచ్చుకు రాసాగెను.

ఆ సమయంలో గోన విఠలభూపతి, సూరపరెడ్డి ఉత్తరపు గవనుకు ఎదురుగా సేనలతో యాదవుని బలగాలలోనికి జొరబడినారు.

ఈ పథకమంతా ఆలోచించి, అపసర్పనాయక శిరోమణి గొంకప్రభువు వలన అందరు నాయకులకు ఆజ్ఞ లంపి మహాదేవరాజు పన్నిన భయంకరపు ముట్టడిని రుద్రదేవి ఎదుర్కొన్నది.

ఆ దినమున ఆంధ్రవీరులు నెరపిన పరాక్రమము అప్రతిమానమైనది. సాయంకాలానికి యాదవ మహాదేవుని సేనలు నాలుగుభాగాలై కోటముట్టడి వీడి రెండు గవ్యూతులు వెనుకకు పోయినవి. కోటగోడనుండి యుద్ధముచేసి వీరులందరు కోటవెలుపలికి వచ్చివేసినారు.

తన అంగరక్షకులతో, చక్రరక్షకులతో, కవచరక్షకులతో రుద్రదేవి మహాశక్తిలా విజృంభించి యాదవ మహాదేవుని తెల్లవారునప్పటికి పది గవ్యూతులు తరిమినది. మహాదేవరాజు ప్రజ్ఞతో తన సేనలన్నిటిని కలుపుకొన ప్రయత్నిస్తూ ఉత్తరాభిముఖుడై, అతినష్టంలేకుండా దేవగిరి చేరడము ఎల్లాగా అన్న తీవ్ర సమస్యను ఎదుర్కొంటూ పారిపోవుచున్నాడు.

నాలుగు దినాలలో హతశేషులైన మూడులక్షల బలగము అయిదు ఖండాలుగా గోదావరి చేరింది. గోదావరి వరదతో గట్లు పొర్లి ప్రవహిస్తున్నది.

వెనుకనే రుద్రమదేవి తన అన్ని సైన్యాలను నడుపుకొంటూ మహాదేవరాజు సైన్యాలను నదీసంగమానికి దిగువ నాలుగు గవ్యూతుల దూరంలో తాకింది.

మల్యాల సైన్యాలను ముందు మంజీరదాటి ఆవలిఒడ్డున ఉండి మహాదేవరాజు నది దాటకుండా చేయుడని గోన గన్నారెడ్డి ఆలోచన చెప్పడంవల్ల ఉభయ మల్యాలసైన్యాలు, మంజీరకు ఎగువను నదిదాటి ఆవలిఒడ్డుననే మంజీరా గౌతమీ సంగమంవరకూ వచ్చి నిలబడినవి. గన్నారెడ్డి సంగమానికి ఇంకా దిగువనే రుద్రదేవి సైన్యాలను వదలి గౌతమినిదాటి ఈవలిఒడ్డుకు మహాదేవరాజును రాకుండా చేయాలని పోయింది.

కాని మహాదేవరాజు నాలుగుదినాల క్రిందటనే దేవగిరికి ప్రజ్ఞావంతులైన రహస్యచారులను పంపించిఉన్నాడు. ప్రతిష్ఠానములో సిద్ధముగావున్న ఏబదివేల నావలు నడుపుకుంటూ దేవగిరి సేనలో సగము వచ్చినవి. ఆ రాత్రి మహాదేవరాజు తన సేనలను ఆవలకు దాటించినాడు.

తెల్లవారుసరికి రుద్రమదేవికి మహాదేవుని గౌతమీతీర శిబిరము నిర్మానుష్యమై దర్శనమిచ్చినది.