కాకతమ్మ
167
పురుషుడే నా భర్త అవుతాడని నాకు తొలకరి మెరుపులా తత్ క్షణం తోచింది. ఆ వివాహం జరుగలేదు.
రుద్రాం: ఆ పురుషుడే నీ భర్త అవుతాడు.
అన్నాం: అక్కా! వేళాకోళం వద్దండీ!
రుద్రాం: ఓసి వెఱ్ఱితల్లీ! నీతోడనా వేళాకోళాలు? నాకు ఏదో అనుమాన రహితమైన భావం హృదయానికి తట్టింది.
అన్నాం: ఆ పురుషుడే మొదటిసారి వివాహం తప్పించాడు.
రుద్రాం: రెండవసారి ప్రధానమూ తప్పించాడు. నీ రహస్యం నేను గ్రహించలే దనుకున్నావా? ఆతడు గజదొంగ! ఇది నీలో దాగివున్న మనోవ్యధ! అందుకనే నా సేనాపతులకూ, సైన్యాలకూ ఆ గజదొంగను ఏవిధంగానూ బాధించక బందీగా పట్టుకోవలసిందని ఆజ్ఞయిచ్చాను.
అన్నాంబిక రుద్రాంబమాటలు వినగానే ఎంతో సిగ్గుపడింది. ఒకసారి ఆనందంలో మునిగిపోయింది. ఒకసారి గజగజ వణికిపోయింది. ఆ వీరుడు గజదొంగయై ఈలా అందరికోపానికి గురి అవడమా? దేశాలు దోచుకుంటున్న మనుష్యునిపై తన మనస్సు లగ్నమైందేమి? అతనిపై అందరూ కత్తిగట్టితే ఇంక ఆయన ఏలాంటి ఆపత్తులో పడిపోవునో?
ఆయన పట్టుబడెనా! ఎంత అవమానం? ఆ అవమానంవల్ల ఏమి వైపరీత్యాలు సంభవించునో? అన్నాంబిక మౌనం వహించి, కంటినీరు తిరుగుతుండగా క్రుంగిపోయి కూర్చుండుట చూచి రుద్రాంబ ‘తల్లీ లోకంసంగతి ఆడువారికి ఏమి తెలుస్తుంది. వారికి తెలిసున్న కొద్దిలోకము పుట్టిల్లూ, అత్తిల్లూను! అందులో రాజవంశాలవారికి భర్తే సర్వలోకమూ! ఇంత చిన్నతనంలో నీ కెన్ని మనోవ్యాకులతలు వచ్చినాయితల్లీ! నీమనస్సులో చీకాకులేమీ పెట్టుకోకులే! ఈ శరత్కాల జ్యోత్స్నాసమయంలో ఈలా కూర్చోడం ఎందుకు? కాకతమ్మతల్లిని ప్రార్థించు, మనస్సు నిర్మలంచేసుకో, అన్నీ ఆ దేవికే అప్పజెప్పు. ఆమే చక్కపరుస్తుంది’ అని అనునయించింది.
వారిద్దరూ మహానవమిరాత్రి అంతస్తులు గడిచి ఉప్పరిగమీదకుపోయారు.
శారదాకాశంలో చిన్న చిన్న మేఘాలు కలయికలేని భావాలులా అక్కడక్కడ తేలుచున్నవి వెన్నెలమాత్రం మల్లెపువ్వులా, పాలసముద్రంలా అన్నాంబికా రుద్రాంబికల నవ్వులా, మధురంగా పరీమళ పూరితమైన విశ్వం అంతా నిండివుంది.
ఆ వెన్నెలను సర్వాంగాలతో ఆస్వాదిస్తూ ఆ చెలులిద్దరూ ఉప్పరిగమీద ఒక రత్నకంబళిపై ఆసీనులై, ఏదో మాయాప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉప్పొంగినారు.
ఆ వెన్నెల సంగీతము పాడినట్లయి, ఆ వెన్నెల కాకతమ్మ చల్లని చూపులై ప్రసరించిపోయినది.