పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

117

బేతాళనాయకుని కుమారుడైన ప్రసాదాదిత్యనాయకునికడ మంత్రిగా ఉండెను.

అక్కినమంత్రి అందలమెక్కి వందిమాగధులు పొగడుతూ ఉండగా కోటగుమ్మం దాటి నగరపాలకుడైన ప్రసాదాదిత్యప్రభువు నగరుచేరుకొని అక్కడ రాజసభలో ప్రవేశించినాడు. అక్కినమంత్రి ప్రవేశించగానే అ సభలోని వారందరు నిలిచి వారికి జోహారు లర్పించారు.

అక్కినమంత్రి ప్రతిభాశాలి, ఉత్తమ పండితుడు, శివభక్తుడు. అరువది మూడేండ్ల వృద్ధుడైన ఆ మంత్రి శివదేవయ్య దేశికులకు కుడిభుజంగా సర్వరాజ కార్యదక్షులై ఉండేవారు.

ఓరుగల్లు నగరపరిపాలన మొకఎత్తు, తక్కిన మహారాజ్య పరిపాలన మంతా ఒకఎత్తు. ఆంధ్రమహాసామ్రాజ్య మంతా, ఓరుగల్లునగరంలో ప్రతి ఫలిస్తూ ఉండేది. ఆ నగరంలో అన్నిశాఖలూ ఆముదం నూనెచే తడిపిన రథ చక్రాల ఇరుసులులా పాలింపబడుతున్నవి.

ఎగుమతి దిగుమతులు, వస్తువుల ఉత్పత్తి, వస్త్రపునేత, వానికి రంగుల అద్దకము, నగరాయుర్వేదము, ఆహారపదార్థముల సేకరింపు, అతిథిపూజ, న్యాయపాలనము, నగరరక్షకశాఖ, నగర మార్గనిర్మాణము, విద్య, సామంత రాజ్యతంత్రము, నగరపశుపోషణ, పశువైద్యము, నగరవినోదశాఖ, నగరోద్యానవనపోషణ, శాకముల మాంసముల అందుబాటు, విపణివీథులు ఈ మొదలయిన శాఖలన్నీ పురాధ్యక్షుడు చూచుకోవాలి. అక్కినమంత్రి ఆ పురాధ్యక్షునకు మంత్రాంగము

అక్కినమంత్రి కుమారుడు నలుబదిరెండు సంవత్సరముల ఈడుగల సోమయామాత్యులు సార్వభౌమసభలో వణిక్ శాఖామంత్రిగా ఉండెను. సోమయామాత్యునకు చినఅక్కినప్రగడ కుమారుడు. ఈ బాలకుడు పదునెన్మిది సంవత్సరాల ఈడువాడు. చిన్నతనములోనే ఉద్దండపండితుడై, సాంగవేదియై, అపర పతంజలి అని పేరు పొందాడు. అతడు గన్నారెడ్డితో కలసి, ఆ గజదొంగకు మంత్రియై, ఆంధ్ర సామ్రాజ్యమునందంతా సింహస్వప్నమైపోయాడు. కొడుకు దుశ్చేష్టితాలన్నీ తలచుకుంటూ సోమయామాత్యులూ, మనుమని ఆగడాలు తలచుకొని అక్కినమంత్రీ నలుగురిలో తలలెత్తుకొని తిరగడానికి సిగ్గుపడుతూ ఉండిరి.

అ ఉదయం అక్కినమంత్రులవారు సభదీర్చి కూర్చుండగానే ప్రసాదాదిత్యప్రభువు సభకు వచ్చారు. అందరూ లేచి నిలుచున్నారు. నాయకుడు అక్కినమంత్రికి నమస్కరించి, సింహపీఠి నలంకరించి, వ్యవహారాలు విచారించ ప్రారంభించినాడు.

నగరంలోని అభియోగాలన్నీ మహాతలవరే పండితసభ సహాయముతో విచారిస్తాడు. పెద్ద పెద్ద అభియోగాలు నగరరక్షక సభకు వస్తాయి. ఈ అభియోగ